టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతికి ప్రతి రోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతినగరంలో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి గతంలో చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చటానికి రూపొందించిందే ఈ గరుడ వారధి ఫ్లై ఓవర్. తిరుచానూరు సమీపంలోని శిల్పారామం నుంచి కపిలతీర్థం వద్ద ఉన్న నంది కూడలి వరకు దీన్ని నిర్మించనున్నారు. ఆరుకిలోమీటర్లు మేర 684 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళిక రూపోందించారు. ఇందులో 67 శాతం నిధులను టీటీడీ, 33 శాతం నిధులను తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ సమకూరుస్తున్నాయి. వారధితో పాటు స్మార్ట్ సిటీ అభివృధ్ధిలో భాగంగా ప్రతిపాదిత ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే దారిలోని 27 రోడ్ల అభివృధ్దిని, ఆధునీకరణను ఈ ప్రాజెక్టులో చేర్చారు. ప్రతి స్తంభంపై శ్రీవారి శంకు, చక్రాలు కనిపించేలా డిజైన్లు రూపోందించారు. పనులు ప్రారంభించిన నాటినుంచి 2 ఏళ్లలో ఫ్లై ఓవర్ పూర్తి చేసి,5 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టాలనే నిబంధనతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆబ్కామ్ సంస్ధకు కాంట్రాక్టు కట్టబెట్టింది. అయితే ఇప్పటివరకు 25 శాతం మాత్రం పనులు మాత్రమే పూర్తయ్యాయి. తాజాగా గరుడవారధి విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గరుడవారధికి రీడిజైన్కు వెళ్లాలని, అలాగే రీ టెండర్లకు వెళ్లాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మొత్తంగా గరుడవారధి నిర్మాణ పనుల్లో నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయింది. త్వరలోనే సరికొత్త డిజైన్తో నిర్మాణపనులు ప్రారంభించేందుకు టీటీడీ పాలకమండలి సమాయత్తం అవుతోంది.