ఏపీలో జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో వార్డు, వాలంటీర్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు 70, 888 మంది ఉండగా, ప్రస్తుతం 51, 718 వాలంటీర్లు మాత్రమే పని చేస్తున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినా..కొందరు వివిధ కారణాలతో ఉద్యోగాలలో చేరలేదు..మరి కొంత మంది తప్పుకున్నారు. అలా 19, 710 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. తాజాగా ఈ పోస్టుల భర్తీకి పురపాలక శాఖ ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మిగిలిపోయిన 19,710 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటికే జనవరిలో ఏపీపీఎస్సీ ద్వారా ఒకేసారి దాదాపు 45 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు మరోసారి వార్డు వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వరుస నోటిఫికేషన్లతో ఏపీ నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది.