ఏపీ వర ప్రదాయని పోలవరం పనులు ఇక చకా చకా జరుగనున్నాయి. పోలవరం నిర్మాణపనులపై విధించిన స్టేను హైకోర్ట్ ఎత్తేస్తూ, మేఘా ఇంజనీరింగ్కు లైన్ క్లియర్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని భావించిన జగన్ సర్కార్ కొత్తగా రివర్స్ టెండరింగ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం హైడల్ ప్రాజెక్ట్తో పాటు, ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వంటి మెగా ప్రాజెక్టును నిర్మించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ…4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసి పనులు పోలవరం పనులు దక్కించుకుంది. గతంలో ఈ టెండర్లో పనులు చేపట్టిన సంస్థల కంటే మేఘా ఇంజనీరింగ్ సంస్థ -12.6 శాతానికి తక్కువ కోట్ చేసింది. ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 628 కోట్లు నిధులు ఆదా అయ్యాయి. అయితే చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన నవయుగ సంస్థ..ఈ రీటెండరింగ్పై హైకోర్ట్ను ఆశ్రయించింది.
దీనిపై సమగ్ర విచారణ జరిపేవరకు మేఘా సంస్థ పనులు స్టార్ట్ చేయకూడదని గతంలో హైకోర్ట్ స్టే ఇచ్చింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇచ్చిన స్టేను హైకోర్ట్ ఎత్తేసింది. ఆ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తరువులు జారీ చేసింది. దీంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధికారులు ఇవాళ ఉదయం పోలవరం స్పిల్వే బ్లాక్ నంబర్ 18 వద్ద భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. హైకోర్టు ఉత్తరువులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో పోలవరాన్ని రెండేళ్లలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పోలవరం హైడల్ ప్రాజెక్టుతో సహా, ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ఎంఈఐఎల్ సంసిద్దమవుతుంది. పోలవరం ప్రాజెక్టుపై హైకోర్ట్ స్టే ఎత్తేయడంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నవయుగ సంస్థకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.