దివంగత ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్రావు కుమార్తె పూనాటి విజయలక్ష్మీ గురువారం నాడు కోర్టులో లొంగిపోయారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయిన కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మీలు చెలరేగిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి చికెన్ వ్యాపారుల వరకు కే ట్యాక్స్ పేరుతో నెలనెలా డబ్బులు భారీగా వసూలు చేసినట్లు కోడెల కుటుంబసభ్యులపై పదుల సంఖ్యలో కే ట్యాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కోడెల కుమార్తె విజయలక్ష్మీపై ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి కొందరు వ్యక్తులను మోసం చేసిన కేసు నమోదు అయింది. గురువారం నాడు నాడు ఈ కేసుకు సంబంధించి గుంటూరు కోర్ట్లో విజయలక్ష్మీ లొంగిపోయారు. అయితే ప్రస్తుతానికి రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ మంజూరు అయింది..
ప్రతి ఆదివారం గుంటూరు వన్టౌన్, టూటౌన్ స్టేషన్లలో సంతకం చేయాలని.. 1వ అదనపు జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు విజయలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం కే ట్యాక్స్ కేసులు, కేబుల్ టీవీ కేసు, అసెంబ్లీ ఫర్నీఛర్ తరలింపు కేసు, గడ్డిస్కామ్ కేసు, ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసిన కేసు, ఇలా…వరుస కేసులతో కోడెల కుమారుడు శివరామ్, కూతురు విజయలక్ష్మీలు కోర్టులకు ముందు పదే పదే లొంగిపోవాల్సి వస్తోంది. మొత్తంగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ..తండ్రికి తలవంపులు తీసుకురావడమే కాకుండా..ఇలా చివరకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని కోడెల కొడుకు, కూతురు చేజేతులా తెచ్చుకున్నారని చెప్పక తప్పదు.