కాకతీయుల నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి, భక్తి ప్రపత్తులకి ప్రతీక గా నేటికీ నిలుస్తున్న రామప్ప త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయం, కేంద్ర సహకారం, సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ఆశీస్సులతో తెలంగాణ శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంకల్పం, చిరకాల స్వప్నం సాకారం కానుంది. అంతర్జాతీయ నిర్ణిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధికి ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన అధికారులతో అనేక సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. యునెస్కో ప్రతినిధుల బృందంతో మంతనాలు చేశారు. అటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పురావస్తు శాఖ అధికారులతోనూ, ఇటు రాష్ట్ర అధికారులతోనూ మాట్లాడుతున్నారు. ఈ పరంపరలో భాగంగా, తాజాగా సోమవారం ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ నారాయణరెడ్డి, తదితర అధికారులతో ములుగులో రామప్ప తాజా పరిస్థితులపై సమీక్షించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, 800 ఏండ్ల కింద కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప, ప్రపంచంలోనే అరుదైన శిల్పకళా నిలయంగా నిలిచిందన్నారు. రామప్ప నాటి ఆధ్యాత్మిక, శిల్పకళా నైపుణ్యాలకు నిదర్శనం అన్నారు. శిల్ప కళా చాతుర్యానికి, సాంకేతికతకు పట్టం కట్టిన రామప్ప కు ప్రపంచ గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే, తాను ఎమ్మెల్సీ అయిన వెంటనే, రామప్పని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో జరిగిన నిర్లక్ష్య బూజు దులిపేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ఆశీస్సులతో నిర్ణిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి ని ప్రారంభించామని చెప్పారు.
రూ.5 కోట్లతో అత్యంత ఆధునికమైన, నాటి శిల్పకళా వైభవాన్ని చాటే విధంగా ఆడిటోరియం నిర్మిస్తున్నామన్నారు. సి ఎస్ ఆర్ నిధులతో రెండు స్వాగత స్వాగత తోరణాలు… ఒకటి, ప్రధాన రహదారి వద్ద, మరోటి, రామప్ప గుడి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నిర్మిస్తున్నామని చెప్పారు. రామప్ప గుడి పక్కనే ఉన్న చెరువు మధ్యలో ఉన్న ఐ ల్యాండ్ లో భారీ శివలింగం ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే రామప్పలో 10 ఎకరాల స్థలంలో ఒక శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్ప కళా అధ్యయనం కోసం ఒక కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి వివరించారు.
యునెస్కో కి నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని,
సెప్టెంబర్ 26,27 తేదీల్లో యునెస్కో బృందం రామప్పలో పర్యటించిందన్నారు. అయితే, యునెస్కో నుంచి మన ప్రతినిధి బృందానికి పిలుపు వచ్చిందని, ఆ మేరకు ఈ నెల 22న పారిస్ లో యునెస్కో బృందంతో సమావేశం ఉందన్నారు. ఆ సందర్బంగా మన రామప్పకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా గుర్తింపు లభిస్తుందన్న ప్రగాఢ ఆశాభావాన్ని ఎమ్మెల్సీ వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపడుతున్నట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారు.
రామప్పని ఆదర్శంగా తీర్చిదిద్దడo కోసం అన్ని శాఖల అధికారులతో కలిపి, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీని వేస్తున్నట్లు ఎమ్మెల్సీ చెప్పారు. పనిలో పనిగా ములుగు జిల్లాని ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందిస్తామని, రాష్ట్రం, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు
అయితే, అధికారులతో ఇదే విషయమై ఎమ్మెల్సీ మరోసారి చర్చించారు. ఎలాంటి లోపాలు లేకుండా, రాకుండా అభివృద్ధి జరగాలని ఆదేశించారు. నిర్మాణ నాణ్యతల్లోనూ, నిధుల విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. రామప్ప గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే, ఇక్కడి కళావైభవం దశదిశలా వ్యాపిస్తుందని, ఇక్కడికి ప్రపంచ పర్యాటకులు పెరిగి, ఇక్కడి ప్రజలకు ఆదాయ మార్గాలు మెరుగు పడతాయన ిఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి వివరించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి జరగాలన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. అందుకు మొట్టమొదటి సారిగా ప్రజలు అత్యంత భక్తి విశ్వాసలతో కొలిచే మేడారం నుంచే మొదలు పెట్టాలన్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచారం రథాలను సిద్ధం చేస్తున్నామన్నారు. Led టీవీ లతో ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలని వివరిస్తూ, ఆ వాహనాలు ఊరూరా తిరుగుతాయన్నారు. అలాగే మేడారం జాతరకు జాతీయ పండుగ గా గుర్తింపు తేవడానికి ప్రయత్నిస్తామన్నారు. దేశంలో కుంభ మేళా తర్వాత అత్యధిక మంది పాల్గొనే జాతర మేడారం అన్నారు. మేడారం ఆసియా ఖండంలోనే పెద్ద జాతర అన్నారు. మేడారం జాతరని ప్లాస్టిక్ వాడని జాతరగా కూడా మార్చాలన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రజలు ప్లాస్టిక్ రహిత సమాజంగా మారాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.