139 ఏళ్లుగా రగులుతున్న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పును ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఈ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోని వస్తుందంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎంత దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినా సీజేఈ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పాదర్శక చట్టమైన ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్ట్ పేర్కొంది. ఈ మేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. 2010 జనవరిలో సీజేఈ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కోర్టుకు చెందిన ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయి సారథ్యంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ పిటీషన్లపై విచారణ జరిపి ఈ ఏడాది ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఎట్టకేలకు ఇవాళ తుది తీర్పును ప్రకటించింది.అయితే, ఆర్టీఐని నిఘా అస్త్రంగా వినియోగించరాదని, న్యాయవ్యవస్థ స్వతంత్రను దృష్టిలో ఉంచుకుని దీన్ని వినియోగించాలని సూచించింది. అంతేకాకుండా కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను మాత్రమే ఆర్టీఐ కింద ఇవ్వడం జరుగుతుందని, అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించేది లేదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టంచేసింది. సో..ఇక నుంచి భారత అత్యున్న న్యాయస్థానం అయినా ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరవచ్చు. మొత్తంగా భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా దేనికి అతీతం కాదని..అది విధిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని ఈ తీర్పు చెప్పకనే చెబుతోంది.