కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిపై అనర్హత వేటు వేస్తూ జూలైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే వీరంతా 2023 వరకు సభాకాలం ముగిసేదాకా ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టేసింది. తాజాగా ఖాళీ అయిన స్థానాల్లో అసమ్మతి ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేసేందుకు అనుమతించింది. ఎమ్మెల్యేలు పోటీ చేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో అసమ్మతి ఎమ్మెల్యేలకు సుప్రీంలో ఉపశమనం లభించినట్టైంది.
అనర్హత వేటు పడిన వారిలో కాంగ్రెస్ నుంచి 14 మంది, జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 చోట్ల వచ్చే నెల 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలంతా తాజాగా బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మెజారిటీ నిలబెట్టుకోవాలంటే కనీసం ఆరు చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది.