టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు ఇప్పటికీ రహస్య మిత్రులు అన్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుతో విబేధించిన పవన్ కల్యాణ్ వామపక్ష పార్టీలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అంతే కాదు ఎన్నికల సమయంలో పవన్ వ్యవహరించిన తీరుపై కూడా అప్పట్లో పలు అనుమానాలు తలెత్తాయి. అధికారంలో ఉన్న చంద్రబాబును ఒక్క మాట అనని పవన్ కల్యాణ్…నాటి ప్రతిపక్ష నేత జగన్ను పదే పదే టార్గెట్ చేశాడు.వైసీపీ దొంగలు..జగన్ అధికారంలోకి వస్తాడో చూస్తా అంటూ పవన్ వూగిపోయాడు. అంతే కాదు ఎన్నికలలో చంద్రబాబుతో సహా, టీడీపీ మంత్రులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేయలేదు. మెజారిటీస్థానాల్లో డమ్మీ క్యాండిడేట్లను పోటీలోకి దింపాడు. నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో జనసేన పార్టీ శ్రేణుల నుంచి ఎంత వత్తిడి వచ్చినా వినకుండా సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపాడు. మరోవైపు చంద్రబాబు పవన్ కల్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలలో ప్రచారం చేయలేదు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ గెలవాలనే గాజువాక, భీమవరంలో ప్రచారం చేయలేదంటూ చంద్రబాబు ఇటీవల పార్టీ మీటింగ్లో చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ల మధ్య కుదిరిన చీకటి ఒప్పందాన్ని తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బయటపెట్టాడని విజయసాయిరెడ్డి వెల్లడించారు. కీలక స్థానాల్లో కేవలం టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకే పవన్ కల్యాణ్ జనసేన తరపున డమ్మీ క్యాండిడేట్లను పోటీ చేయించిన విషయాన్ని వంశీ బయట పెట్టినట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ మంగళగిరితో పాటు తన నియోజకవర్గం గన్నవరంలో కూడా సీపీఐ అభ్యర్థులను పోటీకి పెట్టాడంటూ… వంశీ అంతఃపుర రహస్యాలు వెల్లడించాడని… విజయసాయిరెడ్డి తెలిపారు. ఆఖరకు జనసేన అభ్యర్ధుల బి-ఫారాలు కూడా టీడీపీ ఆఫీస్ నుంచే వెళ్లాయంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల సందర్భంగా బాబు, పవన్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే..వంశీ చెప్పింది వందకు వంద శాతం నిజమే అని అర్థమవుతుంది. మొత్తంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ల చీకటి ఒప్పందాన్ని వంశీ బయటపెట్టినట్లు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.