నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్బెయిల్బుల్ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్ యజమానులు నియమాలను ఉల్లఘిస్తే లైసెన్స్ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇసుక అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా తోపాటు 2ఏళ్ల జైలు శిక్ష విధించే నిర్ణయంపై చట్ట సవరణకు బిల్లు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ అసెంబ్లీలో సమావేశాల్లోనే మద్యం, ఇసుక అక్రమాల నిరోధాలకు సంబంధించి రెండు బిల్లులనూ ప్రవేశపెట్టి సంబంధిత చట్టాలకు సవరణ చేయాలని సీఎం శ్రీ వైయస్.జగన్ అధికారులకు స్పస్టంచేశారు. వీటితోపాటు మద్యం, ఇసుక స్మగ్లింగ్లను అరికట్టడానికి చెక్పోస్టుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. నైట్విజన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వద్దకూడా సీసీ కెమెరాలు ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.