తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ట్వీట్ చేశారని కన్నబాబు మండిపడ్డారు. రైతులకు మద్దతుధర ఇబ్బంది వస్తే ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులతో ఉన్న ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు అప్పగించారని అన్నారు. చివరకు, చంద్రబాబు హయాంలో రైతు రుణమాఫీ కోసం బ్యాంకులనుంచి తీసుకొచ్చిన మూడు వేల కోట్ల రూపాయలను కూడా ‘పసుపు-కుంకుమ’ పథకానికి మళ్లించారని, అటువంటి పరిస్థితుల్లో వున్న రాష్ట్ర ఖజానాను తమ ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. అయినప్పటికీ, ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ‘రైతు భరోసా’ కోసం మిగతా పథకాలు ఆగిపోయాయని, డబ్బులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు పచ్చిఅబద్ధం అన్నారు మంత్రి.