ఏపీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీలో వలసల పర్వం మొదలైంది. చంద్రబాబు తీరుతో వచ్చే పదేళ్ల వరకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వంశీ రాజీనామా చేయగా, గంటా, వాసుపల్లి గణేష్లతో సహా మొత్తం 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోలుకోలేని షాక్ ఇవ్వబోతున్నారు. వారిలో ఒకరు ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కాగా, మరొకరు ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్. వీరిద్దరు త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిపొందారు. కానీ చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా టీడీపీలో చేరారు. అద్దంకిలో కరణం బలరాంకు, గొట్టిపాటి రవికుమార్కు వర్గ విబేధాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఈ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే చంద్రబాబు కరణం బలరామ్ను చీరాల టికెట్ ఇచ్చి అద్దంకి టికెట్ మళ్లీ గొట్టిపాటికే ఇచ్చి సెటిల్ చేశాడు. ఏపీలో టీడీపీ ఘోరపరాజయం తర్వాత పార్టీలో తనకు పెద్దగా ప్రాధాన్యత లేదని భావిస్తున్న గొట్టిపాటి తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా గొట్టిపాటికి జిల్లా మంత్రి బాలినేనితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలినేని సహకారంతో వైసీపీలో చేరేందుకు గొట్టిపాటి రవికుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక జనసేన తరపున రాజోలు నుంచి గెలిచి పార్టీపరువు నిలిపిన రాపాక వర ప్రసాద్ పవన్ కల్యాణ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు వరుసగా ఎదురవుతున్న అవమానాలతో రాపాక తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. మరోవైపు వైసీపీ నేతలతో రాపాకకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీలో చేరేందుకు రాపాక సిద్దమైనట్లు సమాచారం. ఈ మేరకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్లో జరిగిన మంత్రి బాలినేని మనవడి బర్త్డే ఫంక్షన్కు గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మార్పుపై బాలినేనితో చర్చించినట్లు సమాచారం. గొట్టిపాటి చేరిక విషయంలో వైసీపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని తెలుస్తోంది. దీంతో త్వరలోనే అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది.అలాగే రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా కాకినాడ ఎంపీ వంగా గీతతో పాటు జిల్లా ప్రముఖులతో కలిసి ఇటీవల గోదావరి జిల్లాల వైసీపీ ఇన్చార్జ్, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాపాక వైవికి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకేసారి అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కల్యాణ్లకు షాక్ ఇచ్చి..వైసీపీలో చేరబోతున్నట్లు ఇరు పార్టీలలో చర్చ జరుగుతోంది.