హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశంసించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల్లో నాటిన మొక్కలను సంరక్షించేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో శనివారం ప్రకాష్ జవదేకర్ అన్ని రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్. శోభ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అడవుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ భూముల్లో అడవులను పెంచడం, కంపా నిధుల వినియోగం, తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ద్వారా అటవీయేతర ప్రాంతాల్లో మొక్కలు నాటడం, నది పరివాహక ప్రాంతాల్లో అడవుల రక్షణ, నేలలో తేమ శాతాన్ని పరిరక్షించడం, గడ్డి క్షేత్రాల అభివృద్ది, స్కూల్ నర్సరీ యోజన స్కీమ్ ద్వారా మొక్కలు నాటడంలో విద్యార్థులను భాగస్వాములను చేయడం, తదితర అంశాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సమావేశంలో వివరించారు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఐదేండ్ల క్రితమే తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ చర్యలు ప్రారంభించారని తెలిపారు. 24 శాతం ఉన్న అడవులు 33 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు. హరిత హారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం కాగా, ఇప్పటివరకు 175 కోట్ల మొక్కలను నాటామన్నారు. అందులో యాభై శాతానికి పైగా మొక్కలను బతికించుకోగలిగామని తెలిపారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో హరిత హారంలో భాగంగా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందన్నారు. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.
సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యల వల్ల రానున్న మూడు, నాలుగేళ్లలో తెలంగాణ ఆకుపచ్చగా మారబోతుందని వెల్లడించారు. అడవి జంతువులకు సోలార్ పవర్ ద్వారా బోర్లు వేసి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని, జంతువుల ఆహారం కోసం గడ్డి క్షేత్రాలను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా జంతువులు అడవి నుండి బయటకు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 3,110 కోట్ల కంపా నిధులను విడుదల చేసిందని, ఈ సంవత్సరం 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించి ప్రతిపాదనలు పంపించగా.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు.