విద్యార్థుల సృజనాత్మకతకు చక్కని వేదిక వైజ్ఞానిక ప్రదర్శనలని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల ఆలోచనలను ఓ రూపంలోకి తెచ్చేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. పిల్లలు ఇలాంటి ప్రదర్శనలు చూసి సైంటిస్టుగా, పరిశోదకులుగా రూపాంతరం చెందుతారని చెప్పారు. పాఠాలు వినడం కన్నా విద్యార్థులు చూసి నెర్చుకుని చక్కటి విషయ పరిజ్ఞానం పొందుతారని చెప్పారు.
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట తొలి స్థానం సాధించాలి…
పదో తరగతి పరీక్షలు మార్చి 19 వ తేదీ నుంచి జరగనున్నాయని, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందుకు సిద్దమవ్వాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సిద్దిపేట ఈ దఫా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. వంద శాతం ఫలితాలు సాధించాలని, వంద మంది విద్యార్థులు పదికి పది మార్కులు సాధించాలన్నారు. ఈ దిశగా విద్యార్థులు, ఉపాద్యాయులు, జిల్లా విద్యా శాఖ అధికారులు పని చేయాలని ఆదేశించారు. పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది 99.3 శాతం సాధిస్తే ఇంటర్మీడియట్ లో కేవలం 43శాతం మాత్రమే ఉతీర్ణులవుతున్నారని చెప్పారు. దీనిపై ఇప్పటికే జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష జరిపానన్న మంత్రి హరీష్ రావు, కళాశాల లెక్చరర్లతోను సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలల్లో తప్పనిసరిగా నీళ్ల గంట కొట్టాలని ఆదేశించారు. కొండపాక జూనియర్ కళాశాలలోమద్యాహ్న బోజనం పెట్టించాలని మంత్రి స్థానిక నేతలకు సూచించగా అందుకు అంగీకరించారు.