టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొద్దికాలంగా అధిష్టానంతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, మస్తాన్రావు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది.
బీద మస్తాన్ రావు 2009లో నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాలో ఓటమి చెందారు. గత 2019 ఎన్నికల్లో కావలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా అధినేత చంద్రబాబు ఆదేశాలతో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయిష్టంగానే పోటీ చేసిన బీద మస్తాన్ రావు వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.