వీసీ సజ్జనార్.. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. నేరస్థులు, హంతకుల పాలిట సింహస్వప్నం.. ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూస్తే సజ్జనార్ యమపాశం విసురుతాడు.. నేరంచేస్తే తన దగ్గర కోర్టులు, విచారణలు ఉండవంటారు.. తక్షణ న్యాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. గతంలో 2008లో వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ అయినా.. 2019లో దిశ నిందితుల ఎన్కౌంటర్ అయినా.. ఆయన మార్క్ శిక్ష స్పష్టంగా కనిపిస్తుంది. దిశ నిందితుల ఎన్కౌంటర్తో మరోసారి దేశవ్యాప్తంగా ఆయన గురించి అందరూ తెలుసుకుంటున్నారు. అసలుసజ్జనార్ ఎవరు.? ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి.? తదితర విషయాలు తెలుసుకుందాం.. కర్ణాటకలోని ధార్వాడ జిల్లా కేంద్రం హుబ్బలికి చెందిన ఈయన 1996 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్.. ప్రస్తుతం ఇన్స్ పెక్టర్ జనరల్ – ఐజీ ర్యాంకు అధికారిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. జనగాంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా తన కెరీర్ మొదలుపెట్టారు. క్రమశిక్షణ, ముక్కుసూటితనం ఉన్న పోలీస్ గా డిపార్ట్ మెంట్ లో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఆమ్వే కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఆయన మల్టీ లెవల్ మార్కెటింగ్ బిజినెస్ను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన క్యూనెట్ స్కాంపైనా కేసులునమోదు చేసి తనేంటో నిరూపించుకున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తిరుపతిలోని అలిపిరి వద్ద మావోయిస్టుల దాడి కేసులో కీలక సూత్రధారిగా భావించిన నక్సల్స్ నేత సుధాకర్ రెడ్డి ఎన్కౌంటర్ లో సజ్జనార్ కీలకపాత్ర పోషించారు. కొద్దినెలలక్రితం షాద్ నగర్ గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్లోనూ ఈయన కీలకపాత్ర పోషించారు. ఆసమయంలో సజ్జనార్ స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా పనిచేశారు. తర్వాత.. 2018 మార్చి 14న సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. వృత్తి పరంగా తన కింది ఉద్యోగులతోనూ సజ్జనార్ చనువుగా ఉంటారని, అందరూ ఆయన్ను చాలా ఇష్టపడతారని అంటుంటారు. స్వతహాగా శాకాహారి అయిన సజ్జనార్.. ప్రతి రోజు గంటపాటు కచ్చితంగా పూజలు కూడా చేస్తారట. ఎంబీఏ పూర్తి చేసిన ఆయను అనుపను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయన కుటుంబానికి అవసరమైన ప్రత్యేక భద్రత దృష్ట్యా వారి గురించి ఎక్కువగా వివరాలు ఇవ్వలేకపోతున్నాం.