తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో రూట్ కళాశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్ టాపి లు, కృత్రిమ అవయాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు.అలా చిన్న చూపు చూసే వారిలోనే లోపం ఉంది.దివ్యాంగుల పట్ల సరిగా వ్యవహరించని వారి పరిస్థితి చూసి మనం జాలి పడాలి.దివ్యాంగులు ఏ తప్పు చేయలేదు.
అలా పుట్టడం వారి తప్పు కాదు.మన కుటుంబంలోనే దివ్యాంగులు ఉంటే ఎలా వ్యవహరిస్తామన్నది తెలుసు కోవాలి.డబ్బులు బాగా సంపాదించే వారు కొంత స్వార్థం మాని సమాజానికి సాయం చేయాలి.ప్రతీ ఒక్కరూ సమాజానికి ఏం ఇస్తున్నామన్న విషయం పై ఆలోచించాలి.ఏదీశాశ్వతం కాదు. మనం చేసే మంచి పనులే శాశ్వతంగా నిలుస్తాయి.ప్యూర్ సంస్థ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేస్తోన్న సేవకు అభినందనలు.ప్రజలకు సాయం అందించాలన్న కోరికతో చాలా మంది ఉన్నారు. వారికి ప్రతీ పైసా పేదలకు దక్కుతుందన్న విశ్వాసం కల్పించాలి.తెలంగాణ రాష్ట్రం దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉంది.
ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్ 300 నుంచి ప్రభుత్వం 3 వేలకు పెంచింది. ఇందు కోసం 850 కోట్లు ఖర్చు చేస్తోంది.ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 3 శాతం నుంచి 4 శాతానికి ప్రభుత్వం పెంచింది.సంక్షేమ పథకాల్లో ఐదు శాతం దివ్యాంగులకు చెందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇతర రాష్ట్రాలలో 70 శాతం అంగవైకల్యం ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి.
కాని తెలంగాణ ప్రభుత్వం నలభై శాతం అంగవైకల్యం ఉంటేనే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తున్నాం.దివ్యాంగులు చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం ఉంది. వారి సమస్యలు వారే చట్ట సభల్లో ప్రస్తావించే అవకాశం ఉంటుంది.దివ్యాంగులు సైతం చట్ట సభల్లోకి రావాలి”అని ఆయన పిలుపునిచ్చారు.