తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. లోకేష్ , బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన రోజే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొత్త కార్యాలయాన్ని తక్షణమే కూల్చివేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై విచారణ జరిపించాలని కోర్టుకెక్కిన మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సంచలనానికి కారణమయ్యారు. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కోర్టు మెట్లెక్కారు. టీడీపీ కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. భవనాన్ని కూల్చేసి సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆత్మకూరు పరిధిలోని సర్వే నంబర్ 392లో ఉన్న 3.65 ఎకరాల వాగు పోరంబోకు భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ గత ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అది నిబంధనలకు విరుద్ధమని ఎమ్మెల్యే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో సహా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, ఏపీ సీఆర్డీఏ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.
జగన్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజులకే కృష్ణా కరకట్టపై గత ప్రభుత్వ నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇది అక్రమ కట్టడమని ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఉక్కుపాదంతో అణచివేసిన విషయం తెలిసినదే. ఇప్పుడు వాగు పోరంబోకు భూమిలో నిర్మించిన కార్యాలయం కూడా అక్రమ కట్టడమని.. దానిని కూల్చివేసి స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు.
అదే జరిగితే ఇది మరో ప్రజావేదిక అవుతుందా.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తమ పార్టీ కార్యాలయంను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశాలు కల్పించమని సీఎం జగన్ కు విన్నవించుకొనే పరిస్థితులు తలెత్తుతాయేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.