తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బహదూర్ పల్లిలో దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి చెరుకు మల్లారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళ పాటు కోట్లాడిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు దీవించారు.
గత ఆరేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి.. అమలు చేసిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి.. ప్రజలు తమ పార్టీ అభ్య్రర్థులనే గెలిపించి దీవిస్తారు.. అన్ని మున్సిపాలిటీల్లో కారుదే ప్రభంజనం “అని ఆయన అన్నారు.