జనవరి 6 వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతితో సహా తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేంకటేశ్వర ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగరం, జూబ్లిహిల్స్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకంగా ముస్తాబు అవుతుంది. 2019 మార్చి 13 2019 న జూబ్లిహిల్స్లో 3.7 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఈ ఆలయం భక్తుల ఆదరభిమానాలతో దినదిన ప్రవర్థమానమవుతూ..భాగ్యనగర తిరుమలగా ప్రసిద్ధిగాంచింది. కోరిన కోరికలు తీరుస్తూ..శ్రీ వేంకటేశ్వరుడు నగరవాసుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి రోజు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, విఐపీల దగ్గర నుంచి సామాన్య భక్తులతో జూబ్లిహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం హైదరాబాద్ నగరంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. టీటీడీ ఈ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో మాడవీధులు, ఎన్టీవీ నుంచి అప్రోచ్ రోడ్డు, అర్చక క్వార్టర్స్, టాయ్లెట్ బ్లాక్, ఆర్వో వాటర్ ప్లాంట్, కాంపౌండ్ వాల్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తాజాగా జనవరి 6 న వైకుంఠ ఏకాదశి సందర్భంగా జూబ్లిహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతోంది. వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనం కోసం వేలాదిగా తరలిచవచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం విద్యుద్దీపాలంకరణతో ధగధగా మెరిసిపోతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ఛైర్మన్, కమిటీ సభ్యులతో సహా, టీటీడీ అడ్వైజరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ కరణ్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Tags arrangements yaikunta ekadsshi hyderabad jublihills sri venkateshwara temple telangana