ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ బీజేపీ నేతల్లో గందగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ..ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతిలో దీక్ష చేశారు. ఇక బాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అయితే అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు..రాజధాని తరలిస్తానంటే కేంద్రం చూస్తూ వూరుకోదంటూ…బీరాలు పలుకుతున్నారు.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీయల్, ఎంపీ సీఎం రమేష్లాంటి నేతలు మాత్రం ఏపీకి రాజధాని ఎక్కడనే విషయం..రాష్ట్రం పరిధిలోని విషయమని, కేంద్రం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తుంది కానీ..మూడు రాజధానుల వ్యవహారంలో జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. ఇక పురంధేశ్వరీ, విష్ణుకుమార్ రాజు, సోమువీర్రాజు వంటి సీనియర్ నేతలు కూడా అధికార , పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతు పలుకుతూ..మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించారు. ఇలా మూడు రాజధానుల అంశంలో పరస్పర విరుద్ధ అభిప్రాయాలతో ఏపీ బీజేపీ నేతల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మూడు రాజధానులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అసలు మూడు రాజధానుల ప్రతిపాదన గురించి ఇంకా కేంద్రానికి పూర్తి సమాచారం అందలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఏపీ బీజేపీ నేతలు సంయమనం పాటించాలని కిషన్ రెడ్డి కోరారు. మూడు రాజధానుల ఏర్పాటుపై పూర్తి స్పష్టత రాకముందే ఏపీ బీజేపీ నేతలు తలా రకంగా స్పందించడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని కిషన్రెడ్డి ఆక్షేపించారు. అసలు మూడు రాజధానుల ప్రతిపాదన అనేది ఏపీ రాష్ట్ర అంతర్గత వ్యవహారమని, దీనిపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసేవరకు బీజేపీ నేతలు సహనం వహించాలని కిషన్ రెడ్డి అన్నారు. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయం రాష్ట్ర అంతర్గత వ్యవహారం అని కిషన్ రెడ్డి తేల్చి చెప్పడంతో కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోదని స్పష్టమతుంది. మొత్తంగా మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదంటూ కిషన్ రెడ్డి చెప్పకనే చెప్పేశారు. దీంతో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏపీ బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. మూడు రాజధానుల అంశంలో జగన్ సర్కార్ ముందడుగు వేస్తున్న వేళ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రభుత్వానికి మరింత వూతం ఇచ్చినట్లే అని చెప్పాలి. మరోవైపు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరితో సహా అమరావతికి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలకు షాకింగ్గా మారగా…మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్న నేతల్లో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.