రేపు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైష్టవ ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామునే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే రేపు తెల్లవారుజాము నుంచే వైష్టవ ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. అలాగే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పిలుచుకునే ఈ పర్వదినం నాడు ఉపవాసం చేసి, విష్ణు పూజ, గోవింద నామ స్మరణ చేస్తే మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం..అయితే ఉపవాసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు..కొందరు ముందు రాత్రి సుష్టుగా భోజనం చేసి, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు..కొందరు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి భోజనం చేసేస్తారు…మరి కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు..అయితే ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఎలా చేయాలనేదానిపై శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం..ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలనేకునే వారు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున కేవలం తులసీ తీర్థం మాత్రమే సేవించి రాత్రంతా భగన్నామస్మరణతో జాగరణ చేయాలి…మరుసటి రోజు మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాసదీక్షను ముగించాలి.
అయితే ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పాలు, పండ్లు లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. అయితే బియ్యంతో చేసిన పరమాన్నం లాంటి ప్రసాదంగా తీసుకుంటారు..అలా కూడా చేయకూడదు..మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి దీనితో చేసిన పదార్థాలను తినకూడదని పండితులు చెబుతున్నారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములంతా వైకుంఠ ఏకాదవి నాడు ఉత్తర ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గానికి వెళతారని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచారవిధితో ఆరాధించాలి. నిష్ఠతో ఉపవాస దీక్షను ఆచరించి రాత్రంతా జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. అయితే అనారోగ్య సమస్యలతో ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయలేనివారు.. నీరు, పాలు, నెయ్యి, నువ్వులు, పండ్లు తినవచ్చును. అంతే కాని అల్పాహారాలు తీసుకోకూడదు… ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం చేస్తే మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇంకా ఏకాదశి వ్రతము చేసే వారికి మరో జన్మంటూ ఉండదని భక్తుల నమ్మకం. అదండీ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు, నీళ్లు, నువ్వులు తీసుకుంటే దోషం ఉండదని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఉపవాసం చేయలేనివారు..ఈ నియమాలను కచ్చితంగా పాటించండి..