అమరావతి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఒకప్పటి బాబుగారి సన్నిహితుడు ప్రస్తుత ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరాతిని కాపాడుకోకపోతే..పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి.. ఇంతవరకు చేసిన ఎంపీ, ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరమంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అంగుళం కూడా కూడా మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని కాపాడుకోలేకపోతే..ఇక్కడ పౌరుడిగా ఉండడం అనవసరం అనేలా మాట్లాడారు. కచ్చితంగా శరణార్థులుగా వేరే చోటకు వెళ్లిపోవడం మేలు..మరో దేశానికి కాందిశీకుడిగా పోతానంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా సుజనా వ్యాఖ్యలపై బీజేపీలో భిన్న స్పందన వినిపిస్తోంది. ఒక పక్క జీవీయల్, కన్నా వంటి నేతలు మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెబుతుంటే..సుజనా మాత్రం జోక్యం చేసుకుంటుందంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడు. మరోవైపు అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు కేంద్రం సానుకూలంగానే ఉంది. ఈ నేపథ్యంలో సుజనా మాత్రం పదేపదే అమరావతి విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకోదు..కచ్చితంగా తరలిపోతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతి విషయంలో కేవలం చంద్రబాబుకు అనుకులంగా సుజనా చౌదరి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఒక వేళ జగన్ సర్కార్ మూడు రాజధానులపై ముందడుగు వేస్తే అమరావతిలో 600 ఎకరాలకు పైగా కొన్న సుజనా చౌదరికి ఆర్థికంగా దెబ్బ పడుతుందని, అందుకే అమరావతి ఆందోళనల్లో పాల్గొంటూ పార్టీ స్టాండ్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని…బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అయితే సుజనా అన్నట్లు నిజంగానే దేశం విడిచిపోతాడా అన్న అనుమానాలు ఆయన మాటలను బట్టి తలెత్తుతున్నాయి. ఇప్పటికే సుజనాపై 6 వేల కోట్ల బ్యాంకు రుణం ఎగవేత కేసుతో పాటు, విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారని మనీలాండరింగ్ కేసు నమోదు అయింది. ఈ కేసుల నుంచి బయటపడడం కోసమే సుజనా బీజేపీలో చేరాడన్నది వాస్తవం..ఇటీవల సుజనాపై నమోదైన కేసుల్లో విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం…విచారణ జరిపించమని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమరావతిలో రచ్చ చేసి…పార్టీకి మైలేజీ తీసుకురావడం ద్వారా తన కేసులపై విచారణ జరిపించకుండా చూసుకోవచ్చని..అదే సమయంలో తన భూములు కాపాడుకోవచ్చని సుజనా స్కెచ్. అయితే సుజనా కేసుల్లో ఈడీ, సీబీఐ విచారణలు మొదలవుతున్నాయని..వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితుల్లో దేశం విడిచి కాందీశికుడిగా వేరే దేశం పోతానని వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ విచారణలో నేరం రుజువైతే నిజంగానే సుజనా అన్నంత పని చేస్తాడా..దేశం విడిచి వేరే దేశానికి పోతాడా అనే విషయంపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.