ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్నారు. తాను స్వయంగా రంగంలోదిగి అమరావతి జేఏసీ ఏర్పాటు చేసి.. జోలెపట్టుకుని అడుక్కుంటూ.. జిల్లాలు తిరుగుతూ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ నాడు కూడా చంద్రబాబు తన రాజకీయాన్ని వదల్లేదు. సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారంతా సొంత వూర్లకు వచ్చి సంతోషంగా పండుగ చేసుకుంటే..చంద్రబాబు మాత్రం తన రాజకీయం కోసం రాజధాని గ్రామాల రైతులను సంక్రాంతి పండుగ చేసుకోనివ్వలేదు..భోగినాడు జీఎన్రావు, బోస్టన్ కమిటీ నివేదికలను భోగిమంటల్లో తగలేయించి…రాజధాని రైతుల్లో ఉద్వేగాన్ని రగిలించాడు. ఇక సంక్రాంతి పండుగ రోజు..పాపం మందడం గ్రామంలోని తన సామాజికవర్గ రైతులను ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పస్తులుంచారు.. ఈ సందర్భంగా కుటుంబంతో సహా వచ్చేసి సీఎం జగన్పై పిచ్చి తుగ్లక్ అంటూ నోరుపారేసుకున్నారు. దమ్ముంటే మూడు రాజధానులపై ఎన్నికల వెళ్లండి..వైసీపీ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా…అంటూ సవాల్ విసిరారు.
అయితే పండుగ పూట చంద్రబాబు రాజకీయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని నారాచంద్రబాబునాయుడు కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉండి పోయింది. పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదంటూ ఎద్దేవా చేశారు. అయినా ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా చంద్రబాబూ? భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్ ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా.. అని ప్రశ్నించారు.. చంద్రబాబు జోలెపట్టుకుని అడుక్కోవడంపై స్పందిస్తూ.. రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా…అసలు అధికారం కోల్పోయిన 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మొత్తంగా పండుగపూట రైతులను పస్తులుంచి మరీ చంద్రబాబు చేసిన రాజకీయానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు.