ఏపీ శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీకి చెందిన మండలి ఛైర్మన్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఐదుగంటల పాటు కౌన్సిల్ గ్యాలరీలో కూర్చుని స్పీకర్ను ప్రభావతిం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుంది. అందుకే ప్రజలకు మేలు జరుగకుండా అడ్డుకుంటున్న శాసనమండలిని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు అంతర్మథనంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. అందుకు చంద్రబాబే కారణమని లోలోన రగిలిపోతున్నారు. అవనసరంగా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారు. చైర్మన్ను అడ్డుపెట్టుకుని బిల్లులు చట్టరూపం దాల్చకుండా తాత్కాలికంగా అడ్డుకుని.. తమ పదవులకే ఎసరు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు
కాగా మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 34 కాగా.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఆ పార్టీకి చెందిన వారే. మండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది టీడీపీనే. అయితే మండలిలో ఈ రెండు బిల్లుల్ని అడ్డుకునేందుకు బాబు, లోకేష్, యనమల మంత్రాంగం నడుపుతున్న సమయంలోనే పలువురు టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లులను కొద్దిరోజులు అడ్డుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని.. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందని చెప్పారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుందని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు బాబు, లోకేష్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ విప్ను ధిక్కరించి పోతుల సునీత, శివనాథరెడ్డిలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. కొందరు యనమల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం శాసనమండలి రద్దుపై మరో 3 రోజులు సమయం తీసుకోనుంది. ఈలోగా ఎమ్మెల్సీలు తమకు మద్దతు పలుకకపోతే…వెంటనే శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేయగా…పోతుల సునీత, శివనాథ్ రెడ్డి ఆల్రెడీ ప్రభుత్వానికి మద్దతుగా బిల్లుపై ఓటేశారు. అలాగే శమంతకమణి వంటి సీనియర్ ఎమ్మెల్సీ కూడా వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. మరో ఎమ్మెల్సీ శత్రుచర్ల పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.. మొత్తంగా మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించామని సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబుపై ఆ పార్టీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయనున్నట్లు సమాచారం.