ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసుపై సుప్రీంకోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీ వేల కోట్ల డిపాజిట్లను ఖాతాదారులనుంచి సేకరించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో వైయస్ హయాంలో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్కుమార్ మార్గదర్శి కుంభకోణంపై కేసులు వేశారు. దీంతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాల రక్షణ పేరిట ఆర్థిక సలహాదారు రంగాచారిని నియమించింది. ఆర్బీఐ చట్టం ప్రకారం మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ కూడా నియమించింది. ఇక కోర్టుల్లో మార్గదర్శి మోసంపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులపై విచారణ నత్తనడకన సాగింది. 2011లో మార్గదర్శి క్రిమినల్ ప్రొసీడింగ్స్పై హైకోర్ట్ నుంచి స్టే తెచ్చుకుకుంది. అయితే ఏ కేసులోనైనా స్టే ఆరు నెలలకు మించి ఉండకూడదన్న సుప్రీంకోర్టు గైడ్లెన్స్ ప్రకారం మార్గదర్శి తెచ్చుకున్న స్టే కాల పరిమితి ముగిసింది. దానిని పొడిగించాలని మార్గదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు..కాని సుప్రీంకోర్టు స్టే పొడిగించడానికి నిరాకరించింది. దీంతో తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మార్గదర్శిపై నమోదైన క్రిమినల్ పీసీ నెంబర్ 540 ని కొట్టిపడేసి.. చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు.
తాజాగా ఉండవల్లి పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ,అలాగే రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో రామోజీరావు దోషిగా తేలితే..రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు భారీ జరిమానా విధిస్తుంది. వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు జరిమాన (సుమారు 7 వేలకోట్లు) విధించే అవకాశం ఉంది. దానితో పాటు రెండున్నరేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఉన్నట్లుండి అకస్మాత్తుగా మార్గదర్శిపై కేసులో కదలిక రావడంతో చంద్రబాబు, ఆయన రాజగురువు రామోజీరావులో ఆందోళన మొదలైంది. మొత్తంగా మార్గదర్శికుంభకోణంపై సుప్రీంకోర్ట్లో మళ్లీ విచారణ మొదలవడంతో ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.