శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీష్ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించేలా చంద్రబాబు చేసిన కుట్రలపై ఆ పార్టీకే చెందని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. కాగా పోతుల సునీత పార్టీ విప్ను ధిక్కరించి..మూడు రాజధానులపై ప్రభుత్వానికి మద్దతు పలికారు. తదనంతరం తన భర్త పోతుల సురేష్తో కలిసి సీఎం జగన్ను కలిసారు. పోతుల సునీత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కాగా శాసనమండలిలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం జగన్ తీసుకొచ్చిన పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకుని శాసనమండలి ప్రతిష్టను పూర్తిగా దిగజార్చారని సునీత విమర్శించారు. మండలిలో బిల్లు విషయంలో పొరపాటు చేశామని టీడీపీ సభ్యులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇప్పటికైనా వారు బాబు ట్రాప్లో పడకుండా బయటకు వచ్చి తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని శాసన మండలి చైర్మన్కు సైగలు చేస్తూ పూర్తిగా సభను పక్కదారి పట్టించారని తెలిపారు. అసలు చంద్రబాబు గ్యాలరీకి రావాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని సునీత ఫైర్ అయ్యారు. ఇక మండలి చైర్మన్ పూర్తిగా తప్పు చేశారని, ఆయన చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా ప్రలోభాలకు లొంగిపోయారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పోతుల సునీత స్పందిస్తూ.. తమది ప్రజల కోసం పనిచేసే కుటుంబమని, ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు. ఇక మండలి రద్దుపై శాసనసభ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఒక పక్క శాసనమండలి రద్దు అయితే ఎమ్మెల్సీ పదవి పోతుందని తెలిసినా…అధికార వికేంద్రీకరణకు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారారు. మొత్తంగా శాసనమండలిలో చంద్రబాబు తీరుపై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.