వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ ఉండదు.. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లా రాజకీయాలను జేసీ బ్రదర్స్ శాసించారు. జిల్లాలో భూకబ్జాలు, బస్సుల వ్యాపారం, ఫ్యాక్టరీల దగ్గర కమీషన్లు, ఆఖరకు చికెన్ షాపుల దగ్గర జే ట్యాక్స్లు..ఇలా జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ హవాకు గండిపడింది. జిల్లాలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హవా మొదలైంది. మరోవైపు జేసీ బ్రదర్స్ అరాచకాలకు ప్రభుత్వం చెక్పెడుతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఫ్యాక్టరీలపై జేసీ బ్రదర్స్ గుత్తాధిపత్యానికి గండిపడుతోంది.
తాజాగా జేసీ కుటుంబానికి చెందిన ‘త్రిశూల్ సిమెంట్’ కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు… లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ చేపట్టనుంది ఇలా వరుసగా తమ అన్నదమ్ముల అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుండడంతో జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్పై రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు. . రాజధాని గ్రామాలలో దీక్ష చేస్తున్న మహిళలకు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంఘీభావం తెలిపిన జేసీ దివాకర్ రెడ్డి ఆ సందర్భంగా సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నాడని జేసీ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పగతో రగిలిపోతోందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిది ఫ్యాక్షన్ సంస్కృతి అని విరుచుకుపడ్డారు. తనకు 124 బస్సులు ఉంటే 84 బస్సులు మూసివేశాడని..ఇప్పుడు ఫ్యాక్టరీపై పడ్డాడని జేసీ అక్కసు వెళ్లగక్కాడు. ముఖ్యమంత్రి జగన్ ది ఆయన తాత రాజారెడ్డి మనస్తత్వమని, పక్కా ఫ్యాక్షనిస్ట్ అని జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమను చంపకుండా ఆర్థికమూలాలపై దెబ్బకొడుతున్నారని…ఆక్రోశం వెళ్లగక్కాడు. మా వాడికి మంచి బుద్ధి ఇవ్వాలని ప్రభువును వేడుకుంటున్నానంటూ జేసీ వ్యంగంగా వ్యాఖ్యానించారు. అయితే జేసీ వ్యాఖ్యలపై జిల్లాలో విస్మయం వ్యక్తమవుతుంది. 30 ఏళ్లుగా జేసీ బ్రదర్స్ జిల్లాలో అరాచకం చేశారని…జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతికి ఆజ్యం పోసిందే జేసీ బ్రదర్స్ అని… భూకబ్జాలకు, ల్యాండ్ సెటిల్మెంట్లకు, హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా జేసీ బ్రదర్స్ నిలిచారని..అలాంటిది ఇప్పుడు జగన్ హయాంలో జిల్లాలో వారి ఆధిపత్యానికి గండిపడుతుండడంతో జేసీ బ్రదర్స్ జీర్ణించుకోలేకపోతున్నారని..అందుకే సీఎం జగన్పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక అనంతపురం జిల్లాలో మీ పని అయిపోయింది…మీ అన్నదమ్ముల అవినీతి పుట్ట బద్ధలవుతుంది. ఇన్నాళ్లు మీరు చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి..ఇకనైనా హుందాగా మాట్లాడండి అంటూ..వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా మావాడు మావాడు అంటూనే జగన్పై నోరుపారేసుకున్న జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ నేతలు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.