ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో గత 50 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు…అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడురాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. శాసనమండలిలో చంద్రబాబు కుటిల రాజకీయంతో వికేంద్రీకరణ బిల్లుకు ఎదురుదెబ్బ తగలడంతో ఏకంగా శాసనమండలినే రద్దు చేసి…మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేసింది. మరోవైపు కేంద్రం కూడా రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. అయితే అమరావతిని రాజధానిగా గుర్తించామన్న కేంద్రం వ్యాఖ్యలపై టీడీపీ రాజకీయం చేస్తోంది. మూడు రాజధానులను కేంద్రం అడ్డుకుంటుందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని గేట్వే హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుపై తొలిసారిగా స్పందించారు.
ముఖ్యమంత్రిగా నేను తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలపై పడుతుంది. ఒకవేళ నిర్ణయం తీసుకోకున్న ఆ ప్రభావం భవిష్యత్తు తరాలపై ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. రాజధానిగా చెప్తున్న అమరావతి ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవని చెప్పారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. . ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అమరావతికి రూ.1.09,000 కోట్లు ఖర్చు చేయాలా? లేక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచించాను అందుకే..ఒక ముఖ్యమంత్రిగా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.
అలాగే బాహుబలి సినిమా తరహాలో గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని , ప్రజలను మభ్యపెట్టాలని కోరుకోవటం లేదంటూ పరోక్షంగా గత ఐదేళ్లు చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్పై సెటైర్లు వేశారు. ఇక విశాఖలో పరిపాలనా రాజధాని గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖ నగరం మన ఊరు, మన నగరం, మన రాజధాని అని నొక్కివక్కాణించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఉంటుందని తేల్చి చెప్పారు . అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, హెడ్వోడీ, సచివాలయం ఉంటాయి అని ప్రకటించారు. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే ప్రాంతాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదని జగన్ అన్నారు . అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక అదే సమయంలో అమరావతిపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారినా..అమరావతి లెజిస్టేటివ్ కేపిటల్గా ఉంటుందని..అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ తెలిపారు.