మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ మహిళ మేడారంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జాతరకు మూడురోజుల క్రితం చవాన్ శివాని, గోవిందర్ కుటుంబం మేడారం చేరుకొన్నారు.
గర్భిణి అయిన శివానితో కలిసి కుటుంబసభ్యులు గురువారం ఉదయం వనదేవతలను దర్శించుకొన్నారు. అంతలోనే నొప్పులురావడంతో శివానీని దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు శివానీకి సాధారణ ప్రసవం చేశారు. ఉదయం 11.48 గంటలకు శివానీ మగశిశువుకు జన్మనిచ్చింది.
శిశువు మూడున్నర కిలోల బరువుతో ఆరోగ్యంగా జన్మించాడు. ఆమె కుటుంబసభ్యులు జంపన్నే తమ శివానీ కడుపున పుట్టాడని ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాసులకు ఇచ్చే కేసీఆర్ కిట్ను వైద్యాధికారులు పుణె వాసి శివానీకి అందించారు. దీంతో శివానీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.