అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల అమరావతిలో దాదాపు 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు దాదాపు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు బినామీలుగా వ్యవహరిస్తున్న కొందరు తెల్లకార్డుదారుల పేర్లతో భూములు కొనుగోలు చేశారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్ల అక్రమ సొమ్ము మనీ ల్యాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారని…సీఐడీ విచారణలో తేలింది. దీంతో రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్లో పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్ జరిగిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చెన్నై రీజినల్ కార్యాలయానికి సీఐడీ ఏడీజీ పీవీ సునీల్కుమార్ గత నెలలో లేఖ రాశారు. సీఐడీ లేఖతో రంగంలోకి దిగిన ఈడీ, సీఐడీతో సమాంతరంగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో హవాలా, మనీలాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు చేస్తోంది.
అయితే తాజాగా టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్పై దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ అధికారులు.. తెల్లకార్డుదారుల భూముల కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కనగానపల్లి తహశీల్దార్ కార్యాలయంపై సీఐడీ అధికారులు దాడులు నిర్వహించారు. అమరావతిలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డుదారుల వివరాలు సేకరించారు. అమరావతిలో మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కనగానపల్లి వాసులు జయచంద్రచౌదరి, నిర్మలా చౌదరి భూములు కొనుగోలు చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులైన జయచంద్రచౌదరి, నిర్మలా చౌదరి కోట్ల విలువైన భూములు ఎలా కొనుగోలు చేశారన్న విషయంపై వివరాలు సేకరించారు. మాజీ మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతో కొనుగోలు చేశారా లేదా ఇతర వ్యక్తుల బినామీగా ఉన్నారా? అన్న వివరాలపై సీఐడీ ఆరా తీసింది. మొత్తంగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో తెల్లకార్డుదారుల పేర్లతో జరిగిన భూబాగోతంపై సీఐడీ దూకుడిగా వ్యవహరిస్తుండడంతో బాబు బ్యాచ్లో ఆందోళన మొదలైంది.