ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు తొలిరోజే ప్రకాశం జిల్లా ప్రజలు షాక్ ఇచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నట్లు హడావుడి చేశారు. కానీ ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు..చంద్రబాబు రోడ్షో ఆద్యంతం ఆత్మస్థుతి, పరనిందకే సరిపోయింది. చంద్రబాబు ఎప్పటిలాగే…తనను తాను కాసేపు పొగుడుకుని, తుగ్లక్ పాలన అంటూ సీఎం జగన్పై విమర్శలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కొన్నిసార్లు చంద్రబాబు జనాన్ని బతిమాలి మరీ చప్పట్లు కొట్టించుకోవాల్సి వచ్చింది. మార్టూరు స్టేట్బ్యాంకు సెంటర్లో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు బలహీనతతో కొంచెం మద్యం తాగి రిలాక్స్ అవుదామనుకుంటారని…కాని సీఎం వైఎస్ జగన్ మద్యం రేట్లు భారీగా పెంచటంతో ప్రజలు వారి ఆదాయంలో అధికబాగం మద్యానికే వెచ్చించాల్సి వస్తోందన్నారు. దీంతో మద్యం రేట్లు పెంచడం వల్ల మందు తాగడం తక్కువైందని ఆనందపడుతుంటే…చంద్రబాబు మాత్రం తాగుబోతు సంఘం అధ్యక్షుడిలా మద్యం రేట్లు పెంచారంటూ వాపోతున్నారని..ఇదేమి చోద్యమంటూ మహిళలు విస్తుపోయారు.
ఆ తర్వాత మేదరమెట్లలో మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో మీ పని చెప్తా అంటూ పోలీసులను హెచ్చరించారు. మూడు రాజధానులు వద్దని, ఆమరావతి కావాలంటూ అందరూ గట్టిగా నినదిద్దామని పిలుపునిచ్చారు…కాని ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. పెన్షన్లు రద్దు చేస్తున్నారని, ఆమ్మఒడి డబ్బు అందరికీ ఇవ్వలేదని ప్రజలచే చెప్పించే ప్రయత్నం చేశారు. హోదా కోసం ప్రధాని మోదీని నిలదీయలేకపోతున్నారని మాట్లాడడమే తప్ప మోదీని పల్లెత్తు మాట అనే ధైర్యం కూడా చేయలేదు. రోడ్డు షోలో పెద్దగా జనం లేకపోవడం చూసి రోషం లేదా.. మీకోసం నేను వస్తుంటే మీరు ఇళ్లల్లో ఉంటారా అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశాడు.దీంతో 9 నెలలైనా టైమ్ ఇవ్వకుండా ఇలా నవ వైఫల్యాలంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ, పైగా రోషం లేదా..నేనొస్తుంటే ఇళ్లలో ఉంటారా అంటూ తిడుతున్న చంద్రబాబును చూసి విస్తుపోవడం జనం వంతయింది.
అంతే కాదు..మీరందరూ వైసీపీకి ఓటేశారు..అనుభవించండి అంటూ ప్రజలను చీదరించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. చివర్లో ప్రజాచైతన్య యాత్ర విజయవంతం అయిందని అనుకుంటున్నా…అయిందా లేదా అంటూ చంద్రబాబు జనాన్ని ప్రశ్నించడం కొసమెరుపు. ప్రజా చైతన్య యాత్రకు ఎంతగా క్యాడర్ను, జనాలను తరలించినా…చంద్రబాబు ప్రసంగానికి ప్రజలనుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టీడీపీ శ్రేణులు తలలుపట్టుకున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి దుమ్మెత్తిపోస్తునే ఉన్నాం..ఇప్పుడు కొత్తగా విమర్శించడానికి ఏముంటుందని పెద్దాయన ఈ యాత్ర చేపట్టాడు..అంటూ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుతీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రజా చైతన్యయాత్రలో తనకు ఓటేయలేదని ప్రజలపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబుతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.