టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరికి భారీ షాక్ తగిలింది. సుజపా పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2018 అక్టోబర్ 26వతేదీన బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై రుణం తీసుకుంది. అయితే అప్పటి నుంచి ఆ రుణాన్ని తిరిగి చెల్లించకుండా మొండికేస్తోంది. అసలు, వడ్డీ కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి రుణం రూ.400.84 కోట్లకు చేరింది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు బ్యాంకు గురువారం నోటీసు జారీ చేసింది. ఆన్లైన్లో బిడ్ల దాఖలుకు తుది గడువు మార్చి 21గా పేర్కొంది. ఈ–ఆక్షన్ విధానంలో ఆస్తులను మార్చి 23న 11.30 నుంచి 12.30 గంటల మధ్య వేలం వేస్తామని బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడంతో సుజానా అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కాగా బ్యాంకులను మోసగించిన కేసులో 2018లో మూడు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే నాగార్జునహిల్స్లోని సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు జరిగాయి. సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉమ్మడి సోదాలు జరిగాయి. మొత్తమ్మీద రూ.5700 కోట్ల మేర బ్యాంకులకు సుజనా కంపెనీలు టోపీ పెట్టినట్టు గుర్తించాయి. ఆ సోదాల్లో ఏకంగా 126 షెల్ కంపెనీలు గుర్తించారు. ఫెరారీ, బెంజ్, రేంజ్ రోవర్ కార్లను కూడా అప్పట్లో సీజ్ చేశారు అధికారులు.
ఇక బ్యాంకు ఆఫ్ ఇండియా వేలం పాట కింద సుజనా ఆస్తులను విలువలను పేర్కొంది. తమిళనాడులో వై.శివలింగప్రసాద్ పేరుతో 6300 చదరపు అడుగుల భూమి, శ్రీపెరంబూదూరులో ఎస్.టి.ప్రసాద్ పేరుతో 7560 చదరపు అడుగుల భూమి, శ్రీపెరంబూదూరులో శివరామకృష్ణ పేరుతో 7700 చదరపు అడుగుల భూమి, కొలుత్తువంచెర్రీ గ్రామంలో వైఎస్ చౌదరీ పేరుతో 7700చదరపు అడుగుల భూములను వేలం వేస్తామని బ్యాంకు ప్రకటించింది. అన్ని ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నీగా సుజనా చౌదరీ ఒక్కరే ఉండడం గమనార్హం. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని చెబుతున్నారు. మొత్తంగా రుణాల ఎగవేతపై బ్యాంకులు వేలంపాటలు మొదలెట్టాయి. ఇప్పటికే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సీబీఐ, ఈడీ విచారణ చేస్తుండడంతో తన 600 ఎకరాలకు పైగా బినామీ భూముల వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని సుజనా టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు బ్యాంకులు రంగంలోకి దిగి…ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేయడంతో సుజనా చౌదరి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కాగా ఐటీ దాడుల నేపథ్యంలో హవాలా, మనీలాండరింగ్ స్కామ్లో తన గురువు చంద్రబాబు మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది..ఇప్పుడు సుజనా ఆస్తుల వేలానికి బ్యాంకులు రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీలో ఉన్నా..ఆర్థిక నేరాలు కావడంతో సుజనాను రక్షించే నాథుడే కనిపించడం లేదు.. దీంతో గురుశిష్యులిద్దరికి ఒకేసారి బ్యాడ్టైమ్ స్టార్ట్ అయిందని ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.