వికేంద్రీకరణ నేపథ్యంలో అమరావతికి నష్టం జరుగబోతుందంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు గత 71 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ ఎంతగా నినదించినా..అది కేవలం ఐదారు గ్రామాలకే పరిమితమైంది కాని రాష్ట్రవ్యాప్తం కాలేకపోయింది. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జోలెపట్టి, జిల్లాలలో తిరిగినా అమరావతి ఉద్యమానికి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మద్దతు రావడం లేదు. దీనికి కారణం అమరావతి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రాజధాని అని ముద్రపడిపోవడమే. ఇదే విషయాన్ని జనసేన అధ్యక్షుడు గత ఏడాది ఎన్నికల సమయంలో రాయలసీమలో మాట్లాడుతూ అమరావతి అనేది ఒక కులం కోసం కట్టుకుంటున్న రాజధాని…ప్రజా రాజధాని కానే కాదు అంటూ పరోక్షంగా చంద్రబాబు సామాజికవర్గంపై విమర్శలు చేశాడు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేస్తోంది. తాజాగా ఉగాది రోజున పేదలకు 25 లక్షల ఇండ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖలో 6000 ఎకరాల భూముల సేకరణకు సిద్ధమైంది. అలాగే అమరావతిలో రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూముల్లో 1251 ఎకరాల భూమిని పంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులు తమ భూముల పంపిణీకి అంగీకరిస్తున్నా ఒక వర్గం రైతులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం భూములిచ్చిన రైతులకు అడిగిన దానికి ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా..వాళ్లు సంతృప్తి చెందేలా భూసేకరణ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అయితే తాజాగా రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములను పేదలకు పంచడానికి ఉద్దేశించిన జీవోను తీసుకుని రావడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సొంత ఇళ్లు లేని నిరుపేదల కోసం 1251 ఎకరాల భూమిని పంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అమరావతి నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములు చంద్రబాబు హయాంలోనే నిరుపయోగంగా ఉన్నాయని విమర్శించారు. ఇప్పుడు వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాన్ని విశాఖపట్నానికి, హైకోర్టును కర్నూలుకు తరలించడం వల్ల ఈ 33 వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని ఆర్కే చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో భూములు మరోసారి నిరుపయోగంగా మారిపోయే అవకాశం ఉంది కావున సొంత ఇల్లు కట్టుకునేందుకు నిరుపేదలకు వాటిని పంచి పెట్టడంలో తప్పు లేదని ఆర్కే స్పష్టం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రాజధాని ..బహుజన అమరావతిగా, సర్వజన అమరావతిగా విరాజిల్లుతుందని ఆర్కే ప్రకటించారు. అలాగే అమరావతి ప్రాంతంలో 100 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిర్మించాలని తాను సీఎం జగన్ను కోరుతున్నానని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. కాగా బహుజన అమరావతి అంటూ రాజధానికి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పెట్టిన కొత్త పేరుపై దళితులు, అట్టడుగు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తే దేశంలోనే తొలి బహుజన రాజధానిగా అమరావతి ప్రసిద్ధి చెందుతుందని దళిత సంఘాలు అంటున్నాయి. మొత్తంగా బహుజన అమరావతి అంటూ రాజధానికి వైసీపీ ఎమ్మెల్యే కొత్త పేరు పెట్టడంపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.