తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు.
తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్ వైద్యం కోసం రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరుచేసి అండగా నిలిచారు. చీకట్ల లక్ష్మి, కనకయ్య దంపతుల కుమారుడు ఆరేండ్ల వయసున్న సాత్విక్ పుట్టుకతోనే మూగవాడు. నెలకిందట సాత్విక్కు హైదరాబాద్లోని ఈఎన్టీ దవాఖానలో పరీక్షలు చేయించారు.
బాలుడికి మాటలు వచ్చేందుకు రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పగా, ఆర్థికస్తోమత లేకపోవడంతో సాత్విక్ కుటుంబసభ్యులు మిన్నకుండిపోయారు. బాలుడి సమస్యను బండలింగంపల్లి మాజీ సర్పంచ్ బాల్రాజ్ నర్సాగౌడ్ వారంకిందట మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సాయమందించిన మంత్రి అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారని మాజీ సర్పంచ్ చెప్పారు. త్వరలోనే సాత్విక్కు శస్త్రచికిత్స చేయనున్నారు.