సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన విజయవంతమైన చిత్రాలు ‘పవిత్రబంధం’, ‘పెళ్లిచేసుకుందాం’, ‘ఘర్షణ’ చిత్రాల నిర్మాతల్లో ఒకరైన సి.హెచ్. వెంకటరాజు(72) నిన్న ఆదివారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
ఆయనకు భార్య నారాయణమ్మ, కుమార్తెలు గీత, కోకిల, కుమారుడు రమేశ్బాబు ఉన్నారు. చిత్తూరుకి చెందిన వెంకటరాజు సినిమా నిర్మాణం కోసం మద్రాసు వచ్చి స్థిరపడ్డారు. తన స్నేహితుడు జి.శివరాజుతో కలిసి గీతాచిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ను స్థాపించి ‘గూండారాజ్యం’, ‘2టౌన్ రౌడీ’, ‘ఆదర్శం’, ‘ఆరంభం’, ‘నియంత’, ‘అహంకారి’, ‘లేడీబాసు’, ‘పవిత్రబంధం,’ ‘పెళ్లిచేసుకుందాం’, ‘ఘర్షణ’ లాంటి హిట్ చిత్రాలను నిర్మించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘చక్రం’ ఆయన నిర్మించిన చివరి చిత్రం. ఆయన మరణ వార్త తెలియగానే స్నేహితుడు, నిర్మాణ భాగస్వామి జి.శివరాజు, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు టి. నగర్లోని స్వగృహానికి చేరుకొని వెంకటరాజు భౌతికకాయానికి నివాళులర్పించారు.