ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ నేతలు మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇస్తున్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు రహస్య స్నేహితుడిగా టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతాడో..అచ్చంగా జనసైనికులు కూడా అధినేతలాగే బీజేపీని కాదని టీడీపీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ శ్రేణులు టీడీపీతో బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటూ కాషాయనాథులను కంగుతినిపిస్తున్నారు. కొందరు జనసేన నాయకులు ఏకంగా టీడీపీ కండువా వేసుకుని..నామినేషన్లు వేస్తున్నారు. ఈ ఫోటోలో చూడండి.. ఉప్పలగుప్తం మండలం ఎంపీటీసీ స్థానానికి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి నల్లా రమాదేవి తన పార్టీ కండువాతోపాటు టీడీపీ కండువా కూడా వేసుకుని నామినేషన్ దాఖలు చేయడంతో చూసిన వారంతా ఇదేం రాజకీయం అని ముక్కున వేలేసుకున్నారు.. ఆమెకు మద్దతుగా టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచి గుంటు ఫణిప్రసాద్ పక్కనే ఉండి నామినేషన్ పత్రాలు అందజేయడాన్ని చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఒక్క విలసవిల్లిలోనే కాదు. నియోజకవర్గంలోని అమలాపురం, అల్లవరం, ఉప్పల గుప్తం మండలాలనే తేడా లేకుండా అన్నిచోట్లా టీడీపీ, జనసేన పార్టీలు తెరవెనుక పొత్తులు పెట్టుకుంటున్నాయి.
‘మీకు ఇది…మాకు ఇది’ అనే పద్ధతిలో ‘జెడ్పీటీసీ మీకు…ఎంపీపీ మాకు…ఒక ఎంపీటీసీ మీకు.. ఒక ఎంపీటీసీ’ మాకు అంటూ వాటాలు పంచుకున్నట్టు ఎంపీటీసీ స్థానాలు పంచుకుంటున్నాయి. టీడీపీ అగ్రనేతలు జనసేనతో పొత్తు ఉండదని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఇలా తెరవెనుక రాజకీయాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తమ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో ఇలా జనసేనతో తెరవెనుక పొత్తులకు టీడీపీ వెంపర్లాడుతోంది. 37 ఏళ్ల అనుభవం… 24 ఏళ్లు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ టీడీపీ ఇప్పుడున్న గడ్డుస్థితిని గతంలో ఎన్నడూ ఎదుర్కొలేదని టీడీపీ అభిమానులు వాపోతున్నారు. కాగా ఒకవైపు బీజేపీతో పొత్తు అంటూనే జనసైనికులు టీడీపీకి మద్దతు పలుకుతున్నా పవన్ కల్యాణ్ చూస్తూ ఉండిపోవడం చూస్తుంటే.. పవన్ ఇప్పటికీ బాబు తొత్తు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యధా రాజా తజా ప్రజా అన్నట్లుగా మా అధినేత చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తుంటే..మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని జనసైనికులు అంటున్నారు. మొత్తంగా గోదావరి జిల్లాలలో స్థానిక సంస్థలలో టీడీపీ, జనసేన పొత్తులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీతో ఉత్తుత్తి పొత్తు..టీడీపీతో చీకటి పోత్తు..ఇదే పవన్ రాజకీయం అంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.