మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాజాగా కాకినాడ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు మాచర్ల ఘటనపై స్పందించారు. తొలుత సీఎం జగన్పై మంత్రి కన్నబాబు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు వైఎస్సార్సీపీని ఒక చారిత్రక పార్టీగా తీర్చిదిద్దబోతున్నాయని పేర్కొన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు పార్టీని నడిస్తున్నారని.. బడుగు బలహీన వర్గాల కోసం సీఎం జగన్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కన్నబాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు పది శాతం రిజర్వేషన్లు అదనంగా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. దేశంలోనే ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అయితే ఈ యజ్ఞాన్ని ఎలా భగ్నం చేయాలన్న ఆలోచనే తప్ప.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరోక మంచి ఆలోచన ఉండదని కన్నబాబు ఫైర్ అయ్యారు.
అసలు విజయవాడ ఎన్నికలు వదిలేసి మాచర్ల వరకు బోండా ఉమా, బుద్ధా వెంకన్న వంటి నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఏదో ఒక అలజడి సృష్టించడం ద్వారా రాజకీయం చేసి లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు చేసే గిల్లుడు కార్యక్రమం ఎవరికి కనిపించదని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదన్నారు. బలవంతంగా ఎవర్నో ఒకరిని పెట్టాల్సిన పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందన్నారు. అపవిత్రమైన పొత్తులతో చంద్రబాబులా దిక్కుమాలిన రాజకీయాలు ఎవరైనా చేస్తారా అంటూ కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ప్రజామోదం,అభిమానం సీఎం జగన్కు మెండుగా ఉన్నాయని కన్నబాబు చెప్పుకొచ్చారు. మొత్తంగా మాచర్ల ఘటనపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.