స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీలో చేరుతున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనీసం చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకునేటట్లు లేరని, టీడీపీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నామినేషన్లు వేయనివ్వకుండా అరాచకం చేస్తుందంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి మండిపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు కుట్రలన్నీ ప్రజలు గ్రహిస్తున్నారని, అసలు ఆయనకు ప్రతి రోజు ఏదో వంకతో మీడియాలో కనిపించకపోతే నిద్రపట్టదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వత్తాసు పలికే పత్రికలు అసత్య కథనాలు రాస్తున్నాయని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.
ఇక బీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు మోకాలడ్డారని ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు పిటిషన్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో రకంగా అభివృద్ధిని అడ్డుకునేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబును నిజ జీవితంలో మహా నటుడిగా మంత్రి పెద్దిరెడ్డి అభివర్ణించారు. గవర్నర్ను కలిసి ఆయన అసత్యాలు మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితికి టీడీపీ దిగజారిందని ఆయన విమర్శించారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఉగాది నాడు 25 లక్షలు మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు. ఈసీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రాంతాల వారీగా చంద్రబాబు విబేధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చూసి రాష్ట్రంలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదాను కూడా నిలుపుకునేటట్లు లేరని.. టీడీపీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన ఆశ్చర్యం లేదని మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు షురూ అవుతున్న వేళ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినా ఆశ్చర్యం లేదని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారాయి.