కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తామని సీఎం తెలిపారు. అనంతరం కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తామన్నారు సీఎం.ప్రతి వందేళ్లకు ఒకసారి ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందన్నారు సీఎం. దాదాపు వందేళ్ల క్రితం ఈ వైరస్ సోకి కోటి 4 లక్షల మంది చనిపోయారని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నామని చెప్పారు.
ఈ వైరస్ నియంత్రణకు కేంద్రంతో పాటు ఆయా రాష్ర్టాలు కూడా అప్రమత్తమయ్యాయి. అన్ని రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ర్టాల్లో సినిమా హాల్స్, స్కూల్స్ బంద్ చేశారు. పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకుంటున్నారు.దేశంలోని 6 మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. శంషాబాద్ ఎయిర్పోర్టులో రద్దీ బాగా పెరిగింది. హైదరాబాద్ మెట్రోలో ప్రతి రోజు 4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్కు 2013-14లో 88 లక్షలు మంది ప్రయాణికులు వస్తే ప్రస్తుతం 2 కోట్ల 17 లక్షల మంది ప్రయాణికులు వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు 2013-14లో 23 వేల ప్రయాణికులు వస్తే ఇప్పుడు 57 వేల మంది వస్తున్నారు. నాడు 200లకు పైగా విమానాలు వచ్చేవి. ఇప్పుడు 500లకు పైగా విమానాలు వస్తున్నాయి.
అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగిందనడానికి ఈ విషయం చెబుతున్నాను. చైనా, సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, ప్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలింది. దీంతో ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మన దేశంలోని అనుమతించొద్దని కేంద్రం వీసాలు రద్దు చేసింది. ఈ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను 14 రోజులు క్వారంటైన్ చేసి.. నెగిటివ్ అని తేలితేనే బయటకు పంపాలి అనేది కేంద్ర ప్రభుత్వం సూచన అని సీఎం తెలిపారు. ఈ దేశాల నుంచి హైదరాబాద్కు నేరుగా విమానాలు ఉన్నాయి. అయితే వచ్చే వారు ఏ దేశం నుంచి వస్తున్నారో కూడా తెలియడం లేదు. గత వారం రోజుల నుంచి అప్రమత్తంగా ఉన్నాం. 200 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉండి పరీక్షలు నిర్వహిస్తున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.