స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ సమక్షంలో గాదె వెంకటరెడ్డి తన కుమారుడితో సహా వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా వీరిద్దరు టీడీపీకి మార్చి 15 వ తేదీ ఆదివారం సాయంత్రం టీడీపీకి రాజీనామా చేశారు.
1991లో గాదె వెంకటరెడ్డి పర్చూరు నుంచే ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2004 ఎన్నికల సమయంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్ గాదెను గుంటూరు జిల్లాలోని బాపట్ల నుంచి పోటీ చేయించారు. అక్కడ ఆయన 2004, 09 ఎన్నికల్లో గెలిచారు. వైఎస్ చనిపోయాక కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గాదె వెంకటరెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించి విఫలం చెందారు. ఆ తర్వాత 2016లో గాదె వెంకటరెడ్డి చంద్రబాబు నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకుని తన కొడుకుతో సహా టీడీపీలో చేరారు.
ప్రస్తుతం ఏపీలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా టీడీపీనేతలంతా వైసీపీలో చేరుతుండడంతో గాదె కూడా వారి బాటలో నడుస్తున్నారు. గాదె ఫ్యామిలీ చేరికలో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర వహించారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరిబాబురావు, చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేరు రామారావు తదితరులు వైసీపీలో చేరారు. ఇప్పుడు గాదె ఆయన కుమారుడు మధుసూదన్ కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారు. ముఖ్యంగా బాపట్ల, పర్చూరు నియోజకవర్గాల్లో గాదె వెంకటరెడ్డికి మంచి పట్టు ఉంది. అయితే బాపట్లలో వైసీపీ ఎమ్మెల్యే ఉండడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గాదె మధుసూదర్ రెడ్డికి పర్చూరు నుంచి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా తన కుమారుడితో సహా వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుసగా కొనసాగుతున్న వలసలు చూస్తుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.