ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఆరువారాలపాటు వాయిదా వేయడం రాజకీయంగా వివాదంగా మారింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేవలం రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్వయంగా సీఎం జగన్ ఆరోపించారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల అటు అధికార యంత్రాంగం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల వాయిదా వేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు.
కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె విజ్ఙప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియను యధాతథంగా కొనసాగించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక్క వ్యక్తికి మాత్రమే పాజిటీవ్గా తేలిందని, పైగా అతను ఇటలీ నుంచి వచ్చినందు వల్లే కరోనా వైరస్ బారిన పడ్డాడని వివరించారు. ఇప్పటికే కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలను నీలం సాహ్నీ ఈ లేఖలో పొందుపరిచారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ అంత వేగంగా వ్యాప్తి చెందకపోవచ్చని అన్నారు. ఇవే పరిస్థితులు కనీసం మరో నాలుగు వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ 10 రోజుల్లోనే ముగిసిపోతుందని పేర్కొన్నారు. ఈ లోగా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి మరిన్ని చర్యలను చేపడతామని అన్నారు. అలాగే పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం మొత్తం సమాయాత్తమైందని నీలం సాహ్నీ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణ పూర్తయిందని వివరించారు. వాయిదా వేయడం వల్ల ఆయా పనులన్నింటినీ మరోసారి చేపట్టాల్సిన పరిస్థితి ఉంటుందని నీలం సాహ్ని తన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్ష నిర్ణయంపై అధికార యంత్రాంగం తన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి సీఎస్ నీలం సాహ్ని లేఖపై నిమ్మగడ్డ రమేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.