అచ్చెన్నాయుడు…టీడీపీ మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అయిన ఈయనగారికి కాస్త నోటిదురుసు ఎక్కువ. గత చంద్రబాబు హయాంలో నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్పై అవాకులు, చెవాకులు పేలేవారు. ఇప్పటికీ సమయం, సందర్భం లేకుండా సీఎం జగన్పై, వైసీపీ నేతలపై నోరుపారేసుకుంటూ ఉంటారు.అందుకే జగన్తో సహా వైసీపీ నేతలు అచ్చెన్నాయుడిని పదేపదే టార్గెట్ చేస్తూ సెటైర్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సభలో రంకెలు వేస్తున్న అచ్చెన్నాయుడిపై..అచ్చెన్నా కూర్చో..కూర్చో..ఒళ్లు పెరగడం కాదు…కాస్త బుద్ధి పెరగాల అంటూ సీఎం జగన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా కూడా సీఎం జగన్ స్టైల్లో అచ్చెన్నాయుడిపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదావేయడంపై రాజకీయరగడ జరుగుతోంది. కేవలం టీడీపీని కాపాడడం కోసమే చంద్రబాబు నాయుడు తన సామాజికవర్గానికే చెందిన నిమ్మగడ్డతో కుట్రపూరితంగా ఎన్నికలను వాయిదా వేయించారని సీఎం జగన్తో సహా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే ఎన్నికల వాయిదా విషయంలో చంద్రబాబుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అచ్చెన్నాయుడు ఇది వైసీపీ ఎత్తుగడ…ఓడిపోతామనే భయంతోనే జగన్ సర్కార్ ఎన్నికలను వాయిదా వేయించిందంటూ పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు. అచ్చెన్న వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతారా అంటూ అచ్చెన్నపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. అచ్చెన్నకు ఒళ్లు పెరిగిందే గానీ బుద్ధి మాత్రం పెరగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న అచ్చెన్న తన స్థాయిని దిగజార్చుకుని గల్లీ స్థాయి మాటలు మాట్లాడుతూ… తనను తాను గల్లీ లీడర్ ను అని నిరూపించుకున్నారంటూ రోజా ఎద్దేవా చేశారు. మొత్తంగా జగన్ తరహాలోనే ఒళ్లు పెరగడం కాదు..బుద్ధి పెరగాలి అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి రోజా వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.