కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితం అయితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది . అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విషయంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని , ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించాయి.ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ పనిలో ఉన్నాయి. ఇక తాజాగా ఏపీలో కూడా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు సాయం అందిస్తామని చెప్పింది.
ఈ క్రమంలో దేశం , అటు రాష్ట్రాలు కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధానికి తమ వంతు మద్దతుగా సాయం చెయ్యటానికి చాలా మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాలకు అండగా పలువురు తమవంతు సహాయాన్ని అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు భారీ విరాళం ప్రకటించారు. కరోనా పై పోరాటంలో మేము సైతం అని ఆయన ప్రకటించారు . ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తోన్న కరోనా వైరస్ నియంత్రణకు వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు . రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు కరోనా నివారణ చర్యలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా అందజేస్తామని ప్రకటించారు. కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో తరిమికొట్టేందుకే వైసీపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని, ప్రజలంతా సహకరించాలని శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రజలందరూ కచ్చితంగా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.