కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో సమాచార సేకరణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వీరు పూర్తి స్థాయి రిపోర్ట్ అందించనున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్న వారి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని 27 వేల ఆశావర్కర్లు, 8 వేల మంది ఏఎన్ఎంల సేవలను ఈ సర్వే కోసం వినియోగించుకోనున్నారు.
మరోవైపు నేటి నుంచి గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. ఇప్పటికే అత్యవసరం కానీ ఆపరేషన్లు నిలిపివేశారు. అలాగే లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా, ఇప్పటివరకు తెలంగాణలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది.