జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని రేషన్ షాప్ ల ద్వారా రెండు రోజులలో తెల్ల రేషన్ కార్డ్ దారులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. కరోనా నేపద్యంలో ప్రభుత్వం ఒకొక్కరికి 12 కిలోలు చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నగరంలో మొత్తం 674 రేషన్ షాపుల పరిధిలో 5.80 లక్షల కార్డు దారులు ఉన్నారని తెలిపారు. మొదటి 2 రోజులు 67 షాపుల ద్వారా బియ్యం అందజేయడం జరిగిందని, శుక్రవారం నాడు 240 రేషన్ షాపుల ద్వారా బియ్యం అందజేసినట్లు తెలిపారు. రేషన్ కార్డు దారులు ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశాన్ని (పోర్టబులిటీ) ప్రభుత్వ కల్పించడం వలన రేషన్ షాప్ ల వద్దకు లబ్దిదారులు అధిక సంఖ్యలో రావడం, బయోమెట్రిక్ స్తంభించడం తదితర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలు పరిస్థితులను అర్ధం చేసుకొని మీ మీ ప్రాంతాలలోని రేషన్ షాపుల లోనే బియ్యం పొందాలని, అందుకు అనుగుణంగా అన్ని షాపులలో బియ్యం పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. నేటి వరకు 17 వేల కార్డు దారులకు బియ్యం పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్డుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి బియ్యం అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
లభ్దిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు ఏర్పాట్లు చేయాలని సివిల్ సప్లయ్ కమిషనర్, చైర్మన్, హైదరాబాద్ cro లతో మాట్లాడటం జరిగిందని చెప్పారు. కరోనా నేపద్యంలో గుంపులు గుంపులుగా రావద్దని, రేషన్ షాప్ ల వద్ద లబ్దిదారులు సామాజిక దూరం పాటించాలని తెలిపారు. 21.77 లక్షల మంది లభ్దిదారులకు ఒకొక్కరికి 12 కిలోలు చొప్పున 26,377 మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉందని అన్నారు.