కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ విజృంభించింది. చాప కింద నీరులా సైలెంట్ గా అటాక్ చేస్తోంది. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టులకు రక్షణ కల్పించే సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. వారేమీ విదేశాలకు వెళ్ల లేదు. అయినా వారికి కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్ఎఫ్(central industrial security force) జవాన్లు కరోనా బారిన పడ్డారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న జవాన్లు విదేశాల నుంచి వచ్చిన వారిని తనిఖీలు చేశారు.
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా భారత్ లోకి కరోనా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా ఎయిర్ పోర్టులో డ్యూటీ చేసిన 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను క్వారంటైన్ కు పంపింది.
అధికారుల అనుమానం నిజమైంది. జవాన్లు కరోనా బారినపడ్డారు. క్వారంటైన్ లో ఉన్న నలుగురికి గురువారం పాజిటివ్ రాగా.. మిగతా ఏడుగురికి శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలినట్లు సీఐఎస్ఎఫ్ ప్రకటించింది.