తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లపై జాతీయస్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ములుగు జిల్లాలో ఎంతో అంకితభావంతో అమలుచేస్తున్న అంగన్వాడీ టీచర్ను ‘సిటిజెన్ హీరో’గా అభినందిస్తూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ను నీతిఆయోగ్ ప్రశంసించింది.
రమణమ్మ లాంటివారిని ‘ఇండియా కరోనా వారియర్స్’గా అభివర్ణించింది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇచ్చే సరుకులను వారి ఇండ్లకే తీసుకెళ్లి ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయం మేరకు ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామ అంగన్వాడీ టీచర్ రమణమ్మ స్వయంగా తన స్కూటీపై సరుకులను తీసుకెళ్లి తండాల్లోని లబ్ధిదారులకు అందజేశారు. కోడిగుడ్లు, బియ్యం, పప్పులు, నూనెలు, బాలామృతం లాంటి పదార్థాలను లబ్ధిదారులకు పంపిణీచేశారు.
ఇదేమీ అమెజాన్ సర్వీస్ కాదని, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం కోసం సరుకులను ఇంటింటికీ తీసుకెళ్లి అందిస్తున్నామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ చేసి న ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అంగన్వాడీల పనితీరును అభినందించడంతోపాటు రమణమ్మను ‘సిటిజెన్ హీరో’గా అభివర్ణించారు.
కరోనా వైరస్పై పోరులో మహిళా, శిశు సంక్షేమశాఖ పోషిస్తున్న పాత్రను కొనియాడారు. దీనిపై నీతిఆయోగ్ స్పందించింది. గిరిజన ప్రాంతాల్లో తల్లీ, బిడ్డల క్షేమం కోసం కృషిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు అభినందనీయులని పేర్కొన్నది. కరోనా నియంత్రణకు కృషిచేస్తున్న ఇలాంటి విజేతల వివరాలను తమతో పంచుకోవాలని నీతిఆయోగ్ ట్వీట్ చేసింది.