రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు. హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలకోసం ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టంచేశారు.
ప్రజల ప్రాణాలను కాపాడటంలో తెలంగాణ కృషి అభినందనీయమని విదేశాల్లోని వారు సైతం ప్రశంసిస్తున్నారని చెప్పారు. గత ఆరు రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గడం శుభసూచకమని అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు జీర్ణించుకోలేని కొందరు టెస్టులు తక్కువగా చేస్తున్నారంటూ అనవసర విమర్శలుచేస్తున్నారన్నారు. తెలంగాణ చేపడుతున్న చర్యల పట్ల కేంద్ర బృందాలు సంతృప్తి వ్యక్తంచేశాయని చెప్పారు. గత 50 రోజులుగా అధికార యంత్రాంగమంతా బాధ్యతతో పనిచేస్తున్న ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయొద్దన్నారు. రాష్ట్రంలో రోజుకు 1,540 మందికి పరీక్షలుచేసే సామర్థ్యం ఉన్నదని, ఇదికాకుండా ఒకేరోజు 3,500కు పైగా టెస్టులు చేసే సామర్థ్యం ఉన్న యంత్రాలకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని మంత్రి ఈటల పేర్కొన్నారు. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు