హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. అయితే పాజిటివ్ వచ్చిన వారిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర వైద్యశాలలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా తొమ్మిది మంది పోలీసులు, 108 ఉద్యోగి, కొరియర్బాయ్, ఆటోడ్రైవర్ ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. వీరిని చికిత్స నిమిత్తం పలు దవాఖానలకు తరలించి, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు.
రామంతాపూర్లో మరో ఏడు..
రామంతాపూర్ : రామంతాపూర్ గోఖలేనగర్లో ఒకే కుటుంబానికి చెందిన వృద్ధుడు (76), వృద్ధురాలు(69), వ్యక్తి(48), యువకుడు(21)లకు కరోనా పాజిటివ్ వచ్చింది. శ్రీనగర్కాలనీకి చెందిన వ్యక్తికి(49), వెంకట్రెడ్డినగర్కు చెందిన వ్యక్తికి(45), కామాక్షిపురంకు చెందిన వృద్ధుడు (70)లకు కరోనా సోకింది.
కుత్బుల్లాపూర్లో మరోనాలుగు..
దుండిగల్ : చింతల్ డివిజన్ పరిధిలోని చంద్రానగర్ ఫేజ్-2కు చెందిన ఓ వ్యక్తికి, న్యూమార్కేండేయనగర్కు చెందిన మరోవ్యక్తికి కరోనా సోకిందని మండల వైద్యాధికారులు పేర్కొన్నారు. వీరితో పాటు చింతల్ సుదర్శన్రెడ్డినగర్లో ఓ వ్యక్తికి, ఎన్టీఆర్నగర్కు చెందిన మహిళకు కరోనా సోకినట్లు తెలిపారు.
బాలాపూర్ మండలంలో..
బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ గుర్రంగూడ సాయి హోమ్స్ ఫేస్ 2లో నివాసముంటున్న కానిస్టేబుల్కు, మీర్పేట అధిత్యనగర్లో నివాసముంటున్న కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చిన్నట్లు వారు తెలిపారు.
బంజారాహిల్స్లో..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నం 11లోని రాఘవ రెసిడెన్సీలో పేయింగ్ గెస్ట్గా నివాసముంటున్న వైద్యురాలు(25) నిలోఫర్ దవాఖానలో పనిచేస్తున్నది. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో ఆమెను కొంపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో క్వారంటైన్ చేశారు. ఫిలింనగర్లోని అపోలో దవాఖానలో బిల్లింగ్ విభాగంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యువకుడి(23)కి కరోనా పాజిటివ్ వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నం 12లోని సయ్యద్నగర్కు చెందిన వ్యక్తి(46) డ్రైవర్ పనిచేస్తున్నాడు. అతడికి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీకి తరలించారు.
నేరేడ్మెట్ : నేరేడ్మెట్ డివిజన్ ఆఫీసర్స్కాలనీలో నివాసముండే మహిళ (48)కు పాజిటివ్ అని తేలింది.
భోలక్పూర్లో ఇద్దరికి..
బషీర్బాగ్ : భోలక్పూర్ డివిజన్లోని సంజీవయ్యనగర్లో వృద్ధుడు(70)కి, పద్మశాలీ కాలనీలో వృద్ధుడికి(61) కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరిని గాంధీ దవాఖానకు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు.
జియాగూడలో తొమ్మిది మందికి
జియాగూడ : జియాగూడ డివిజన్ పరిధిలో అదివారం తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందిరానగర్లో నలుగురికి, న్యూగంగానగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి (36), రంగనాథ్నగర్ ప్రాంతానికి చెందిన మహిళ (45), పన్నిపూర ప్రాంతంలో మహిళ(50), సబ్జీమండి ప్రాంతంలో వ్యక్తి (58), ఇమామ్పురా ప్రాంతానికి చెందిన మహిళ (30)కి కరోనా పాజిటివ్ వచ్చింది.
అంబర్పేటలో ఆరు పాజిటివ్ కేసులు
అంబర్పేట : అంబర్పేటలో ఆదివారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో బాగ్అంబర్పేట సోమసుందర్నగర్కు చెందిన ఓ వ్యక్తికి (34) కరోనా పాజిటివ్ అని తేలింది. నల్లకుంట తిలక్నగర్కు చెందిన ఓ వృద్ధుడికి(61), గోల్నాక డివిజన్ తులసీరాంనగర్ కాలనీలో నివాసముండే వ్యక్తికి(50), కాచిగూడ నింబోలిఅడ్డా ఎస్సీ హాస్టల్కు ఎదురుగా నివాసముండే వ్యక్తికి(38) కరోనా సోకింది. ఉస్మానియా దవాఖానలో హౌజ్ సర్జన్గా పనిచేస్తూ కాచిగూడ, నింబోలిఅడ్డాలో నివాసముండే వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఓ కొరియర్ కార్యాలయంలో పనిచేస్తూ బాగ్అంబర్పేట బుర్జుగల్లీలో నివాసముండే వ్యక్తికి కరోనా సోకింది.
రాంనగర్లో ఒకే కుటుంబంలో ఆరుగురికి
ముషీరాబాద్ : రాంనగర్లో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. అదే కుటుంబానికి చెందిన కుటుంబ పెద్ద గత నాలుగు రోజుల కిందట కరోనా బారిన పడి మృతిచెందగా తాజాగా అతడి భార్యా, ఇద్దరు పిల్లలు, అతని సోదరుడు, సోదరుడి భార్య, వారి కుమారుడు మొత్తం ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు వారందరినీ గాంధీ దవాఖానకు తరలించి చికిత్స చేస్తున్నారు.
కంటోన్మెంట్లో ఐదుగురికి కరోనా చనిపోయిన వ్యక్తికి పాజిటివ్
కంటోన్మెంట్ : కంటోన్మెంట్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసుల తీవ్రత పెరిగిపోతున్నది. ఈ క్రమంలో ఆదివారం ఒక్క రోజే ఐదుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. శనివారం మృతి చెందిన వ్యక్తికి సైతం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పికెట్ గాంధీ కాలనీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి(53), తిరుమలగిరిలోని శ్రీనగర్కాలనీలో నివాసముంటున్న ఓ వ్యాపారస్తుడు(50), ఆదే ప్రాంతంలోని ఆర్టీసీ కాలనీలో ఉంటున్న 108 అడ్మినిస్ట్రేటీవ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి(30), బోయిన్పల్లి పరిధిలోని హరిజన బస్తీకి చెందిన ఆటోడ్రైవర్(52), యాదిరెడ్డి కాలనీలో నివాసముంటున్న ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఓగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినికి(57) కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారి కుటుంబసభ్యులను హోం క్వారంటైన్లో ఉంచగా, పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. ఇదిలా ఉండగా బొల్లారంలో వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి(42) నెల రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో నాంపల్లిలోని ఓ దవాఖానలో చేరాడు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతదేహానికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.
వృద్ధుడి అంత్యక్రియలకు నిరాకరించిన శ్మశానవాటిక కమిటీ
కార్వాన్ : జియాగూడ న్యూ గంగానగర్కు చెందిన వృద్ధుడు(75) శనివారం అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు గాంధీ దవాఖానకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. దీంతో అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుడి కొడుకు సంజీవ్ జీహెచ్ఎంసీ, పోలీసులతో కలిసి పురానాపూల్ శ్మశానవాటికలో వివరాలు తెలిపి ఫీజు చెల్లించేందుకు వెళ్లగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు లేదని తెలుపుతూ శ్మశానవాటిక నిర్వాహణ కమిటీ ఫీజు తీసుకునేందుకు నిరాకరించిందని ఆరోపించాడు. ఈ విషయమై తాను ప్రశ్నిస్తే కుల్సుంపురా పోలీసులతో తమకు గొడవ ఉందని, పోలీసులు తమకు క్షమాపణ చెబితేనే అనుమతిస్తామని తెలిపినట్లు సంజీవ్ పేర్కొన్నాడు. చేసేది లేక రాంసింగ్పురాలోని గణేశ్ఘాట్ హిందూ శ్మశాన వాటికకు వెళ్లగా వారు ఫీజు తీసుకొని అనుమతిచ్చారన్నారు. సోమవారం గాంధీ మార్చురీ నుంచి తన తండ్రి మృతదేహాన్ని తీసుకువచ్చి గణేశ్ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సంజీవ్ తెలిపారు. ఈ విషయమై కుల్సుంపురా ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా అలాంటిదేమి లేదన్నారు.
కరోనా పరీక్షలు చేయించుకున్న నగర మేయర్
ముందు జాగ్రత్తగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ కొవిడ్ – 19 పరీక్షలు చేయించుకోగా ఆయనకు నెగెటివ్ వచ్చినట్టు సీపీఆర్వో యాసా వెంకటేశ్వర్లు తెలిపారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక హోటల్లో టీ తాగారు. ఆ హోటల్లో అప్పటికే ‘టీ’ పంపిణీ చేసిన వ్యక్తి పది రోజుల ముందు నుంచే విధులకు హాజరుకావడం లేదు. అయినప్పటికీ నిరంతరం గౌరవ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి తిరుగుతున్నందున, అపోహలు తొలగించుటకు ఈ నెల 5న ఉస్మానియా మెడికల్ కాలేజీలో కొవిడ్ – 19 పరీక్ష చేయించుకున్నారు. అయితే రిపోర్టులో నెగెటివ్ వచ్చినట్లు సీపీఆర్వో వివరించారు.
బంజారాహిల్స్ పీఎస్ కానిస్టేబుల్కు కరోనా ఆందోళనలో ఏసీబీ అధికారులు
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్కు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై యూసుఫ్గూడ జహహర్నగర్లోని ఆయన నివాసంలోనే హోం క్వారంటైన్గా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై రవీందర్నాయక్ని అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు పోలీసు స్టేషన్కు వచ్చి విచారణ జరిపారు. పది గంటల పాటు పోలీసుస్టేషన్లో సదరు కానిస్టేబుల్, ఇతర సిబ్బందితో కలిసి ఉన్నారు. దీంతో వారి రక్తనమూనాలు సైతం సేకరించనున్నట్లు తెలుస్తున్నది.
జియాగూడలో ఇద్దరు మృతి
జియాగూడ : జియాగూడ డివిజన్ పరిధిలోని జోషిగల్లి ప్రాంతంలో నివసించే ఓ వృద్ధురాలు (65) కరోనాతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ అదివారం మృతి చెందింది. న్యూ గంగానగర్ ప్రాంతంలో నివాసించే ఓ వృద్ధుడు (75) కరోనాతో ఐదు రోజుల కిందట కరోనా పాజిటివ్గా రావడంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు.
అంబర్పేటలో ముగ్గురు మృతి
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో కరోనా మహమ్మారి సోకడంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. బాగ్అంబర్ పేట డీడీ కాలనీకి చెందిన కిరాణాషాపు యజమాని, అంబర్పేట ప్రేంనగర్కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందిన వారిలో ఉన్నారు.
బషీర్బాగ్ : భోలక్పూర్లోని దేవి చౌక్కు చెందిన వృద్ధుడు(85) కరోనాతో చికిత్సపొందుతూ ఆదివారం గాంధీ దవాఖానలో మృతి చెందాడు.
ఏఎస్సైకి కరోనా పాజిటివ్
వెంగళరావునగర్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో క్రైం విభాగంలో విధులు నిర్వహించే ఏఎస్సై (56)కి కరోనా లక్షణాలు ఉండటంతో శనివారం పరీక్షలు నిమిత్తం గోషామహల్లో నిర్వహించే పోలీసుల వైద్య పరీక్షల కేంద్రానికి తరలించారు. అక్కడ కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సంబంధిత ఎఎస్సై తో సంబంధం ఉన్న తోటి సిబ్బంది, టోలీచౌకిలో ఉంటున్న కుటుంబ సభ్యులను ఐసోలేషన్కు తరలించారు.
బేగంబజార్ పీఎస్లో..
సుల్తాన్బజార్ : బేగంబజార్ పోలీస్స్టేషన్లో ఇద్దరు పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. బేగంబజార్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తించే హెడ్కానిస్టేబుల్(54), పెట్రో మొబైల్ కానిస్టేబుల్(29)లకు కరోనా సోకిందని అడ్మిన్ ఎస్సై సుధాకర్ తెలిపారు. గాంధీకి తరలించారు.
అఫ్జల్గంజ్లో కానిస్టేబుల్కు..
సుల్తాన్బజార్ : అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్స్టేషన్ పెట్రోమొబైల్లో విధులు నిర్వర్తించే ఫలక్నుమా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్కు గత మూడు రోజుల కిత్రం జ్వరం రావడంతో అతడికి వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది.
చెంగిచర్లలో కానిస్టేబుల్కు..
మేడ్చల్ : ఓ పోలీస్ కానిస్టేబుల్కు కరోనా సోకింది. చెంగిచర్ల కనకదుర్గ కాలనీ ఫేజ్ 3లో నివాసముంటున్న వ్యక్తి(48)యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆ పోలీస్స్టేషన్కు చెందిన ఓ కానిస్టేబుల్కు కరోనా సోకడంతో తోటి సిబ్బందికి వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో అతను నివాసముంటున్న కాలనీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి అధికారులు చర్యలు చేపట్టారు.
నిమ్స్ దవాఖాన ఉద్యోగికి
మెహిదీపట్నం: లంగర్హౌస్ డివిజన్ పెన్షన్ పురాలో నివసించే ఓ యువతి(23)కి ఆదివారం కరోనా పాజిటివ్ వచ్చింది. ఈమె నిమ్స్ దవాఖానలో పారామెడికల్ స్టూడెంట్గా విద్యనభ్యసిస్తుంది. ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతుంది. కుటుంబసభ్యులను హోం క్వారంటైన్లో ఉంచినట్లు పోలీసులు చెప్పారు.
పోరండ్లలో తల్లీకొడుకుకు..
మహేశ్వరం : మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామంలో తల్లీకొడుకుకు పాజిటివ్ వచ్చిందని దుబ్బచెర్ల వైద్యాధికారి డాక్టర్ సంధ్యారాణి తెలిపారు. దీంతో గ్రామంలో వారితో కాంటాక్టులో ఉన్న 17 మందిని హోంక్వారంటైన్ చేశారు. తల్లీకొడుకులను గాంధీ దవాఖానకు తరలించారు.