ఒక ఎనిమిది సంవత్సరాల కుర్రాడు జట్కా బండిలో పక్క ఊరికి వెళుతున్నాడు.భూసామి కుటుంబస్తుడయినందువల్ల జట్కా బండివెంట ఇద్దరి పనివాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. కొంతదూరం వెళ్ళిన తరువాత ఆ పిల్లవాడు బండిఆపి వాళ్ళను ఎక్కమన్నాడు. అయితేవారు భయపడి మేము అలా ఎక్కకూడదని,మీ నాన్నకు తెలిస్తే చంపేస్తాడని చెప్పేరు. అయినా ఆ బాలుడు ఎక్కాలసిందే అని పట్టుపట్టాడు. వారు వినలేదు. అయితే నేనూ కూడా మీతోనే నడిసివస్తానని బండిదిగి వారితో నడవసాగేడు. ఆ అబ్బాయి నడిచాడని వాళ్ళ నాన్నకు తెలిస్తే తమను శిక్షస్తాడని భయపడిన పనివాళ్ళు ఇంక చేసేది లేక బండెక్కినారు. అలా పనివాళ్ళను కూడా సమానభావంతో చూసిన విశాల హృదయంగల ఆ బాలుడే తర్వాతకాలంలో భారతదేశానికి తొలి తెలుగు ప్రధాని అయి ప్రపంచంలో భారత్ ను ఒక ప్రముఖ ఆర్థికశక్తికి మలిచినాడు. తెలుగువాళ్ళందరికీ గర్వకారణమైన రోజు ఈ రోజునే. ఆ వ్యక్తి యే పి.వి గా పిలుసుకొనే పాములపర్తి వెంకటనరసింహారావుగారు.
కుల,వర్గ ప్రాంతీయ వైషమ్యాలకు పేరుబడ్డ ఆంథ్రప్రదేశ్ లో ఎటువంటి కోటరీ లేకుండానే సొంత ఇమేజ్ తో రాష్ట్రమంత్రి గానూ,ముఖ్యమంత్రిగానూ, కేంద్రమంత్రిగానూ, చివరన ప్రధానమంత్రిగానూ ఎన్నో పదవులలంకరించిన మేధావి పి.వి గారు. ముఖ్యంగా 1972లో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 70% సీట్లు వెనకబడిన తరగతులకు ఇచ్చి సంచలనం సృష్టించాడు. అలాగే భూ సంస్కరణలలో లాండ్ సీలింగ్ ,పట్టణ భూపరిమితి చట్టం పక్కాగా అమలుచేసినందున భూస్వాముల ఆగ్రహానికి గురైనారు.
దేశచరిత్రలో గాంధీ ,నెహ్రూయేతర కుటుంబాల నుంచి వచ్చి ఐదు సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేసుకొన్న మొదటి ప్రధాని ఇతనే.అలాగే ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపిన ఘనత కూడా పి.వి గారిదే. వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తున్న మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థికమంత్రిని చేసి సంస్కరణలకు నాంది పలికారు. మంచి వ్యక్త,బహుభాషా కోవిదుడు,కవి,సాహితీవేత్త మితభాషి అయిన పి.వి గారు ప్రధానిగా భారతదేశానికే కాకుండా మన తెలుగుజాతికి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అయితే ఉత్తర భారతదేశ ఆధిపత్య ధోరణివల్ల,ముఖ్యంగా కొన్ని గుంటనక్కల రాజకీయాలకారణంగా కొన్ని అపవాదులు ఎదుర్కొని తగినంత గుర్తింపుకు నోసుకోలేకపోయాడు. నేడు పీవీ నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం